బస్సును తాకిన హైఓల్టేజ్ కరెంట్ తీగ: విద్యుద్ఘాతానికి.. !
భువనేశ్వర్: ఒడిశాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు హైఓల్టేజ్ కరెంటు తీగను తాకింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు. 35 మందికి గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని బెర్హంపూర్లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి (ఎంకేసీజీ) వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పట్ల ఒడిశా ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.
ఒడిశాలోని గంజాం జిల్లా బెర్హంపూర్ సమీపంలోని గోలన్తారా వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గోబిందనగర్ నుంచి బెర్హంపూర్కు బయలుదేరిన బస్సు మార్గమధ్యలో గోలన్తారా వద్ద ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. రోడ్డుకు అడ్డంగా వేలాడుతున్న11 కేవీ సామర్థ్యం ఉన్న విద్యుత్ తీగ బస్సును తాకింది. ఫలితంగా- బస్సు మొత్తం షాక్కు గురైంది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు విద్యుద్ఘాతానికి గురై మరణించారు.
అయిదుమంది ప్రయాణికులు బస్సులోనే ప్రాణాలు వదిలారు. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. 35 మంది గాయపడ్డారు. అంబులెన్సుల ద్వారా వారిని బెర్హంపూర్లోని ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, గంజాం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పినాక మిశ్రా, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఘటనకు దారి తీసిన కారణాలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆయన ఇంధన మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. మృతుల్లో చాలామంది పేద, దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారేనని చెబుతున్నారు.