8లక్షల లీటర్ల ఫ్రెష్ బీర్.. డ్రైనేజీ పాలు కానుందా.. ఆ సదుపాయం కల్పించకపోతే అంతే సంగతి..
దేశవ్యాప్తంగా మద్యం షాపులను ఇంత సుదీర్ఘ కాలం మూసివేయడం బహుశా ఇదే తొలిసారేమో. లాక్ డౌన్లో వైన్ షాప్స్,బార్లు,రెస్టారెంట్లు పూర్తిగా మూతపడటంతో మైక్రో బ్రూవరీ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. దాదాపు 8లక్షల లీటర్ల ఫ్రెష్ బీర్ వృథా కానుందని మద్యం రంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు,భారత్లో తయారైన 1.2మిలియన్ల కేసుల ఫారిన్ లిక్కర్(IMFL) నిల్వలు ఢిల్లీ మినహా ఉత్తరాది రాష్ట్రాల్లో అలాగే ఉండిపోయాయని చెబుతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఈ మద్యం నిల్వలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినివ్వాలని కోరుతున్నారు.
బ్రూవరీ కన్సల్టెంట్స్ ఏమంటున్నారు..
బ్రూవరీ కన్సల్టెంట్ ఇషాన్ గ్రోవర్ దీనిపై మాట్లాడుతూ.. 'బాటిల్ బీర్ మాదిరిగా కాకుండా, తాజా బీర్ లేదా క్రాఫ్ట్ బీర్ను తక్కువ కాలం మాత్రమే నిల్వ చేయగలం. ఇప్పటికే గుర్గావ్లోని పలు బ్రూవరీలు నిల్వ ఉన్న బీరును పారబోయడం మొదలుపెట్టాయి. ఆ బీరును అలాగే ఫ్రెష్గా ఉంచాలంటే ప్రత్యేక ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. ఇందుకోసం భారీగా విద్యుత్ అవసరం.' అని చెప్పారు.
గ్రోలర్స్ ద్వారా టేక్-అవే సదుపాయం కల్పించాలని..
క్రాఫ్ట్ బీర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా అన్ని ప్లాంట్లలో దాదాపు 8లక్షల ఫ్రెష్ బీర్ అలాగే నిల్వ ఉండిపోయింది. దీనికి త్వరగా సరైన పరిష్కారం చూపించకపోతే.. ఇదంతా డ్రైనేజీ పాలు కాక తప్పదు. కేంద్రం లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగించినందునా.. మైక్రో బ్రూవరీస్ బిజినెస్ దెబ్బతినకుండా ఉండాలంటే... గ్రోలర్స్(కంటైనర్స్) ద్వారా బీర్ను టేక్-అవే పద్దతిలో సప్లై చేసేందుకు అనుమతించాలంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 దేశాల్లో గ్రోలర్స్ ద్వారా ఫ్రెష్ బీర్ టేక్-అవే సదుపాయం ఉందని మహారాష్ట్ర క్రాఫ్ట్ బ్రూవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నకుల్ బోన్స్లే తెలిపారు.
ఇప్పటికే క్లియర్ కావాల్సిన స్టాక్..
దేశవ్యాప్తంగా 250 మైక్రో బూవరీస్ ఉన్నాయని నేషనల్ ఆఫీసర్ బేరర్ ఆఫ్ క్రాఫ్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిబి వెంకటరాజు తెలిపారు. ఇందులో దాదాపు 50వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా మార్చి 25వ తేదీ నుంచి బ్రూవరీస్ అన్నీ మూతపడ్డాయన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 1.2మిలియన్ల కేసుల మద్యం నిల్వ ఉందని.. నిజానికి ఇది గత ఫైనాన్షియల్ ఇయర్ కంటే ముందే క్లియర్ కావాల్సిన స్టాక్ అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కాహాలిక్ బేవరేజ్ కంపెనీస్(CIABC) జనరల్ డైరెక్టర్ వినోద్ గిరి తెలిపారు. దీని విలువ రూ.700కోట్లు ఉంటుందన్నారు. ఈ స్టాక్ను క్లియర్ చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు.
Recommended Video
కేంద్రం ఏం నిర్ణయిస్తుందో..
లాక్ డౌన్ 3.0 మార్గదర్శకాల్లో మద్యం షాపులు,పాన్ షాపులకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే బార్లు,రెస్టారెంట్లకు మాత్రం ఎలాంటి అనుమతినివ్వలేదు. దీంతో ఇప్పటికే నిల్వ ఉన్న మద్యం స్టాక్ను క్లియర్ చేయడం కష్టమనే వాదన వినిపిస్తోంది.అదే జరిగితే వందల కోట్ల రూపాయల నష్టం తప్పదంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రూవరీస్పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.