లష్కరే తోయిబా పోస్టర్లు, ప్రతుల పంపిణీ చేస్తోన్న ముఠా.. సభ్యుల అరెస్ట్
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన తర్వాత కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు విఫలయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పౌరులపై కాల్పులు జరిపిన ముష్కర మూకలు .. చొరబడేందుకు కూడా ప్రయత్నించారు. తాజాగా లష్కరే తోయిబా అనుబంధ సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరు లష్కరే తోయిబాకు చెందిన పోస్టర్లను అంటిస్తోండగా ... స్థానికులు వ్యతిరేకించారు. అయితే వారిని బెదిరించి, భయపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై .. ఎనిమిది మంది లష్కరే తోయిబా అనుంబంధ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
లష్కరే తోయిబా పోస్టర్లను అంటిస్తూ ... పంపిణీ చేస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో విషయం వెలుగుచూసింది. వారి ఫిర్యాదు మేరకు ఐజాజ్ మీర్, ఒమర్ మీర్, తాసిఫ్ నాజర్, ఇంతియాజ్ నాజర్, ఒమర్ అక్బర్, ఫైజాన్ లతీఫ్, దానిష్ హబీబ్, షౌకత్ అహ్మద్ మీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా సజాద్ మీర్ అలియాస్ హైదర్, అతని గ్రూపు సభ్యులు ముదసిర్ పండిత్, అసిఫ్ మక్బూల్ భట్ నేతృత్వంలో లష్కరే తోయిబాకు చెందిన పోస్టర్లు ముద్రించారని తెలిపారు.
వాటిని ఈ ఎనిమిది మందికి ఇవ్వడంతో .. వారు గోడలపై అంటిస్తూ, పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. లష్కరే అనుబంధ సభ్యుల నుంచి కంప్యూటర్లు, పోస్టర్ల పంపిణీకి ఉపయోగించే ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన పౌరుల హత్యకు సంబంధించి వీరికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.