లోయలో పడిపోయిన వాహనం: పెళ్లి బృందంలో 8 మంది దుర్మరణం
సిమ్లా: పెళ్లి బృందం వెళ్తున్న వాహనం లోయలో పడిపోయి 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పెళ్లి బృందం ప్రతేక వాహనంలో ప్రయాణిస్తున్నారు.
ఆ సమయంలో ఒక మలుపులో వెలుతున్న సమయంలో వాహనం అదుపు తప్పి.. సుమారు 200 అడుగుల లోతులో ఉన్న లోయలోకి వాహనం పడిపోయింది. వాహనంలో ఉన్న వారు చెట్లు, రాళ్ల మద్య చిక్కుకున్నారు. నిమిషాల వ్యవధిలో వాహనం లోయలోకి పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న చంబా జిల్లా ఏఎస్పీ కుల్వత్ ఠాగూర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
చంబా జిల్లా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిని వారిని రక్షించి చంబా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మలుపులో వేగంగా వెళ్తున్న వాహనాన్ని డ్రైవర్ అదుపు చెయ్యలేకపోవడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
మరణించిన వారందరు చంబా జిల్లాకు చెందిన వారేనని, ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ మరణించాడని పోలీసులు చెప్పారు. పెళ్లి బృందంలో 8 మంది చనిపోవడంతో విషాదచాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వెంటనే ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని జిల్లా పోలీసులు, జిల్లాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.