నేపాల్లో విషాదం... వయాగ్రా కోసం వెళ్లి...
డోప్లా : నేపాల్లో విషాదం చోటు చేసుకుంది. అరుదుగా లభించే వనమూలికను సేకరించేందుకు వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. నేపాల్లోని డోప్లా జిల్లాలో ఈ ఘటన జరిగింది. హిమాలయన్ వయాగ్రాగా పేరున్న యార్సాగుంబా 10వేల ఫీట్ల ఎత్తులో లభిస్తుంది. దీన్ని సేకరించేందుకు 8మంది హిమాలయా పర్వతాలు ఎక్కారు. అయితే సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వారిలో ఐదుగురు అనారోగ్యం పాలై మృత్యువాతపడ్డారు. అత్యంత ఖరీదైన వనమూలికను సేకరించే క్రమంలో మరో ఇద్దరు కొండపై నుంచి జారిపడి కన్నుమూశారు. వయాగ్రా సేకరించేందుకు తల్లితో కలిసి వెళ్లిన ఓ చిన్నారి సైతం అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయాడు.
లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణముందన్న కారణంతో యార్సాగుంబాకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీని కిలో ధర రూ.60లక్షల పైమాటే అంటే దానికున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. నేపాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని వారంతా ఈ వనమూలికను సేకరించి అమ్మి డబ్బు సంపాదిస్తారు. ఇందుకోసం తమ ప్రాణాలను పణంగా పెడతారు.
హిమాలయాల్లో వేసవి ప్రారంభమై మంచు కరగడం మొదలైన వెంటనే నేపాలీలు యార్సాగుంబా వేట మొదలుపెడతారు. నెల రోజుల పాటు చిన్నాపెద్దా తేడా లేకుండా దాన్ని సేకరించేదుకు పోటీ పడతారు. పసుపు రంగులో ఉండే ఈ మూలిక బురదలో పెరుగుతుంది. లైంగిక ఉత్తేజం కలిగించడంతో పాటు అనేక అనారోగ్యాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతుంటారు
గొంగళిపురును తలపించే ఓ పురుగు లార్వాపై ఫంగస్ మాదిరిగా యార్సాగుంబా పెరుగుతుంది. శీతాకాలంలో పురుగులాఉండే యార్సాగుంబా వేసవి నాటికి ఫంగస్ కారణఁగా చిన్న మొక్క మాదిరిగా మారిపోతుంది. పూర్తిగా ఎండిన తర్వాత ఈ వనమూలిక రెండు నుచి మూడు సెంటీమీటర్ల పొడవుతో అగ్గిపుల్లలా కనిపిస్తుంది. యార్సాగుంబా సేకరణలో భాగంగా ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి అనారోగ్యం పాలవుతుండటంతో ప్రభుత్వా వారికోసం ప్రత్యేకంగా క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తోంది.