దళిత విద్యార్థులతో టాయిలెట్ల క్లీనింగ్: 8మంది టీచర్లు అరెస్ట్
తిరునల్వేలి: జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో దళిత విద్యార్థులతో బలవంతంగా మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న 8 మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నాళ్లు టీచర్లు దళిత విద్యార్థులతో పాఠశాల మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నట్లు బయటికి రావడంతో పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో దళితులు ఆందోళన చేపట్టారు.
కళాక్కడ్ సమీపంలోని కీలపతాయి పండితంకురిచిలోని పాఠశాలలో జరుగుతున్న ఈ దారుణ ఘటనపై వారం రోజులుగా దళితులు ఆందోళనలు చేస్తున్నారు. సంబంధిత ఉపాధ్యాయులను కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత 8 నెలలుగా దళిత విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నట్లు వారు ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల నుంచి తొలుత ఎలాంటి స్పందన రాలేదు. 20 రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై దళిత సంఘాల ఆందోళనలతో గురువారం నిందిత 8 మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన టీచర్ల వివరాలు తెలిపేందుకు గానీ, పెట్టిన కేసుల గురించి తెలిపేందుకు గానీ పోలీసులు సుముఖత వ్యక్తం చేయలేదు.
కాగా, 6 నుంచి 8వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థులతో పాఠశాల సమయంలోనే బలవంతంగా మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. మరుగుదొడ్లను శుభ్రం చేయనట్లయితే తీవ్రంగా కొడతామని కూడా ఆ విద్యార్థులను టీచర్లు బెదిరించినట్లు ఆరోపించారు.
మరుగుదొడ్లు శుభ్రం చేయించడంతో ఓ విద్యార్థి పాఠశాలకు కూడా వెళ్లడం మానేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వామపక్షాల పార్టీల నేతలు, దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ నేరం రుజువైతే నిందితులైన టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.