8ఏళ్ల బాలుడి ఆలోచనకు సత్యా నాదెళ్ల ఫిదా!(వీడియో)
న్యూఢిల్లీ: ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల తన భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తోపాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. అయితే, ఒక ఎనిమిదేళ్ల బాలుడు మాత్రం సత్య నాదెళ్లను అమితంగా ఆకర్షించాడు.
గేమింగ్ డెవలపర్ అయిన ఈ భారత బాలుడు సాంకేతికత, పర్యావరణ సమతూల్యతపైన తన ఆలోచనను వినిపించి ఆకట్టుకున్నాడు. అతడే ముంబైకి చెందిన విద్యార్థి మేదాన్ష్ మెహతా. తాను రూపొందించిన 'లెట్ దేర్ బీ లైట్' అనే యాప్ను విద్యార్థి పారిశ్రామిక ఔత్సాహికులతో భేటీ అయిన సందర్భంగా సత్యా నాదెళ్లకు మెహతా వివరించాడు.
సత్యా నాదెళ్లను మెహతా ఎంతగా ఆకర్షించాడంటే.. నాదెళ్ల తన ప్రసంగంలో ఈ బాలుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'ఎనిమిదేళ్ల బాలుడుని నేను కలిశాను. ఇంత చిన్న వయస్సులో అతడు తన ప్రతిభను చాలా పెంచుకున్నాడు. అతని వయస్సులో నేను సమయాన్ని అంతగా వినియోగించుకోలేదు' అని తెలిపారు.
'ఆర్థికాభివృద్ధితోపాటు పర్యావరణ సమతూల్యత గురించి ఆ బాలుడికి చాలా అవగాహన ఉంది. ఈ రెండు అంశాల అభివృద్ధితో కూడిన సమాజాన్ని ఆ బాలుడు కోరుకుంటున్నాడు. అతని లక్ష్యం స్పష్టంగా ఉంది. ఈ అంశంతోనే అతడు ఓ గేమ్ ను రూపొందించాడు' అని సత్యా నాదెళ్ల పేర్కొన్నారు.
' అతను తన గేమ్ 'లెట్ దేర్ బీ లైట్'లో అభివృద్ధితోపాటు పర్యావరణంపై దృష్టి సారించాడు. ప్లేయర్లు సిటీలను, ఫ్యాక్టరీలను నిర్మించాలి. దాంతోపాటు పంటపొలాలు, పర్యావరణంపైనా దృష్టి సారించాలని చెప్పాడు. గాలిని కూడా కలుషితం చేయకుండా చూడాలని కోరాడు. అంతేగాక, పురుత్పత్తి చేసుకోగల సోలార్, పవన శక్తులను వినియోగించుకోవాలని స్పష్టం చేశాడు' అని మెహతాపై సత్యా నాదెళ్ల కొనియాడారు.
కాగా, మెహతా, సత్యా నాదెళ్ల మధ్య కొంత ఆసక్తికర సంభాషణ కూడా సాగింది. తాను తర్వాతి కాలంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ కావాలంటే ఏం చేయాలని మెహతా.. సత్యా నాదెళ్లను అడిగాడు. దీనికి సమాధానంగా 'ఇప్పటికే నీవు నీ లక్ష్యం ( తర్వాతి కాలం సీఈఓ) దిశగా సాగుతున్నావు. అంతకన్నా గొప్పగానే నీ పనివుంది' అని చెప్పారు నాదెళ్ల.