పసివాడి ప్రాణం తీసిన 8ఏళ్ల బాలుడు!
ఢిల్లీ : మానవత్వం మంటగలుస్తోంది. పెంపకంలో లోపమో, టీవీ ప్రభావమో తెలయదుగానీ, ముక్కుపచ్చలారని చిన్నారులు మర్డరు చేసేందుకు వెనకాడటంలేదు. తన తమ్ముడిని కొట్టిందన్న కోపంతో 8 ఏళ్ల బాలుడు ఏడాదిన్నర చిన్నారిని చంపేశాడు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ ఉదంతం సమాజం ఎటు పోతుందా అన్న ప్రశ్న లేవనెత్తుతోంది.
దీనంగా దత్తత తీసుకుంటారు..! దారుణమైన దందా చేయిస్తున్నారు దరిద్రులు..!!
ఢిల్లీలో వెలుగుచూసిన దారుణం
దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఫతేపూర్ బేరి ఏరియాలో డ్రైనేజ్ గుంతలో పసివాడి శవం కలకలం రేపింది. ఇంటికి 50మీటర్ల దూరంలో దొరికిన ఏడాదిన్నర చిన్నారి కుడి కన్ను, పొట్ట, పాదంపై గాయాలను పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం కోసం ఎయిమ్స్కు తరలించారు. ఇదిలా ఉంటే అదే సమయంలో పసివాడి పొరుగింట్లో ఉండే ఎనిమిదేళ్ల బాలుడు మిస్సైనట్లు పోలీసులకు కంప్లైంట్ అందింది. మిస్సింగ్, కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకూ ఆ బాలుడి ఆచూకీ కనుగొన్నారు. ఇంట్లోంచి పారిపోయిన ఆ ఎనిమిదేళ్ల అబ్బాయికి కౌన్సిలింగ్ నిర్వహించగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చిన్నారిని హత్య చేసిన బాలుడు
డ్రైనేజీలో దొరికిన ఏడాదిన్నర చిన్నారిని తానే చంపినట్లు ఎనిమిదేళ్ల బాలుడు అంగీకరించాడు. మధ్యాహ్నం సమయంలో తల్లి పక్కన నిద్రిస్తున్న పసివాణ్ని తీసుకెళ్లి హత్య చేశానని అన్నాడు. ఆ భయంతోనే ఇంట్లోంచి పారిపోయానని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.
అసలేం జరిగిందంటే...
హత్యకు గురైన చిన్నారి, ఎనిమిదేళ్ల బాలుడు ఫతేపూర్ బేరిలో పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఒకరోజు ఆడుకుంటున్న సమయంలో హత్యకు గురైన పసివాడి అక్క 8 ఏళ్ల బాలుడి తమ్ముడిని నెట్టి వేసింది. దీంతో వాడి తలకు గాయమైంది. దీనిపై ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. తన తమ్మున్ని కొట్టిందన్న కారణంతో ఆ బాలుడు సదరు అమ్మాయిపై పగ పెంచుకున్నాడు. తనకు బుద్ధి చెప్పాలని భావించి అమ్మాయి తమ్ముడి ఎత్తుకెళ్లి చంపేశాడు. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసి పారిపోయాడు. 8ఏళ్ల బాలుడు చేసిన దారుణంపై పోలీసులు సైకాలజిస్టుల సాయం తీసుకుంటున్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకెళ్లాలని భావిస్తున్నారు.