గోశాలలో మరణ మృదంగం: రాత్రికి రాత్రి 80 గోవులు మృత్యువాత: నురగలు కక్కుతూ
జైపూర్: రాజస్థాన్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి 80 గోవులు మృత్యువాత పడ్డాయి. నురగలు కక్కుకుంటూ ప్రాణాలు విడిచాయి. దీనికి గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి గోవులు మరణించడానికి దారి తీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నారు. గోశాలతో గోవుల కళేబరాల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షలకు పంపించారు. ఈ నివేదికలు అందిన తరువాతే గోవుల మరణానికి కారణం ఏమిటనేది వెల్లడవుతుందని అధికారులు పేర్కొన్నారు.
Recommended Video
రాజస్థాన్లోని చురు జిల్లా బిల్యుబాస్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు స్థానికంగా గోశాలను నడిపిస్తున్నారు. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో స్థానికులు గోవులకు ఆహారాన్ని అందిస్తుంటారు. ఉత్తరాది పెద్ద పండుగల్లో ఒకటైన ఛాత్ పూజ సందర్భంగా స్థానికులు గోవులకు ఆహారాన్ని అందించారు. అది ప్రతీసారీ జరిగే ప్రక్రియే. స్థానికులు గోవులకు ఆహారాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, ఎప్పుడూ ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోలేదని స్థానిక అధికారులు వెల్లడించారు.
గోవుల మరణానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరావాల్సి ఉందని, దీనికోసం ఆరా తీస్తున్నామని సర్దార్ షెహర్ తహశీల్దార్ కుతేంద్ర కన్వర్ తెలిపారు. గోవులకు వేసిన దాణా సంబంధించిన నమూనాలను పరీక్షల కోసం పంపించామని వెల్లడించారు. గోశాల నిర్వహణ పరిస్థితులపైనా ఆరా తీస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై చురు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులకు సూచించారు.
జిల్లాలోని అన్ని గోశాలకు సంబంధించిన వివరాలను అందజేయాలని చెప్పారు. గోశాల నిర్వహణ, పరిసర ప్రాంతాలు, అనారోగ్యకర వాతావరణం వంటి అంశాలతో కూడిన నివేదికను రూపొందించాని అన్నారు. దాణను ఎక్కడి నుంచి తెప్పించారో తెలుసుకుంటున్నామని, వాటిని సరఫరా చేసిన వారిని కూడా విచారించే అవకాశాలు లేకపోలేదని కుతేంద్ర కన్వర్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.