పొమ్మన్నా.. పొగబెట్టినా!: అధికారిక బంగ్లాలను ఖాళీ చేయని 82 మాజీ ఎంపీలు!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన, పదవీకాలం ముగిసిన కొందరు మాజీ ఎంపీలు.. తమ అధికారిక బంగ్లాలను మాత్రం ఖాళీ చేయకపోవడం లేదు. ఎన్నికల్లో గెలిచిన కొత్త ఎంపీలకు నివాస సదుపాయాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఖాళీ చేయాలని లోక్సభ ప్యానెల్ సూచించినప్పటికీ.. వారి ఆదేశాలను భేఖాతరు చేస్తుండటం గమనార్హం.
ఇలా సుమారు 82మంది మాజీ ఎంపీలు తమ నివాసాలను ఖాళీ చేయడం లేదని విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్సభ హౌసింగ్ కమిటీ ఆగస్టు 19న 200 మాజీ ఎంపీలు తమ బంగ్లాలు ఖాళీ చేయాలని సూచించింది. అంతేగాక, ఖాళీ చేయకుంటే నీరు, విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరించింది కూడా.
అయినా ఇవేమీ పట్టించుకోని మాజీ ఎంపీలు బంగ్లాలు ఖాళీ చేయకుండా అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. 200మందిలో ఇంకా 82మంది మాజీ ఎంపీలు బంగ్లాలను ఖాళీ చేయకుండా అక్కడే ఉంటున్నారు. దీంతో హౌసింగ్ కమిటీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీలు అయినప్పటికీ ఇంకా అధికారిక బంగ్లాల్లో ఎలా ఉంటారని, ఖాళీ చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇప్పటికీ ఖాళీ చేయని మాజీ ఎంపీలపై ఆక్రమణదారుల చట్టం కింద ఖాళీ చేయిస్తామని స్పష్టం చేసింది. విద్యుత్, మంచినీరు, వంట గ్యాస్ వంటి సదుపాయాలను పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేసింది. కాగా, లోక్సభ రద్దైన తర్వాత నెల రోజులలోపే ఎంపీలు తమ బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.