మన్మోహన్ సింగ్..82 ఏళ్ల వయస్సులో కరోనాను జయించాడు: ప్లాన్ మార్చుకున్న డాక్టర్లు..!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలను కోల్పోతున్న వేళ.. వయోధిక వృద్ధులకు చికిత్స చేయడం వల్ల ఉపయోగం ఉండదంటూ అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న సమయంలో.. ఓ వయోవృద్ధుడు కరోనా వైరస్ను జయించారు. 82 సంవత్సరాల వయస్సులో కరోనా వైరస్ను తరిమి కొట్టారు. ఆయన పేరు మన్మోహన్ సింగ్. కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా దేశ రాజధానిలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీకి చెందిన ఆయన కిందటి నెల కరోనా పాజిటివ్ లక్షణాలతో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చేరారు. ఇదివరకు ఆయన విదేశాల్లో పర్యటించిన హిస్టరీ ఉంది. విదేశాల నుంచి వచ్చిన కొద్దిరోజుల తరువాత మన్మోహన్ సింగ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారించారు. ఐసొలేషన్లో ఆయనకు చికిత్స అందించారు.
#WATCH Manmohan Singh, an 82-year-old COVID19 patient at Delhi's Lok Nayak Jai Prakash Narayan hospital who has now fully recovered; he will be discharged soon. pic.twitter.com/R3BcI15sUc
— ANI (@ANI) April 7, 2020
మంగళవారం ఆయన పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆయనను మీడియా ముందుకు తీసుకొచ్చారు. వీల్ఛైర్ మీద కూర్చోబెట్టుకుని మన్మోహన్ సింగ్ను ఆసుపత్రి బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని అన్నారు. 82 సంవత్సరాల వయస్సులో మన్మోహన్ సింగ్.. ప్రాణాంతక కరనా వైరస్ బారి నుంచి కోలుకోవడం గొప్ప విషయమని డాక్టర్లు తెలిపారు.
తాము అందించిన వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందించిన తీరు అద్భుతమని డాక్టర్లు తెలిపారు. వయోధిక వృద్ధులకు వైద్యం అందించకుండా నిరాకరిస్తున్నామనే విషయం సరైంది కాదని అన్నారు. వయోభేదం లేకుండా తాము ప్రతి ఒక్కరికీ వైద్యాన్ని అందిస్తున్నామని, దానికి నిదర్శన మన్మోహన్ సింగేనని చెప్పారు. కొన్ని చోట్ల డాక్టర్లు వయోవృద్ధులకు చికిత్స అందించట్లేదంటూ వార్తలు వస్తున్న విషయం వాస్తవమేనని, అలాంటి డాక్టర్లు ఇక తమ ప్లాన్ను మార్చుకోవాల్సి ఉంటుందని సూచించారు.