బ్రిటీషు రాజ్యంలో బతుకుతున్నామా: ధోవతి ధరించాడని వృద్ధుడిని రైలు ఎక్కనివ్వని పోలీసులు
ఇటావా: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు కావొస్తున్నప్పటికీ నాటి బ్రిటీషు వారు అవలంబించిన పద్దతులు మాత్రం అలానే కొనసాగుతున్నాయని కొన్ని ఘటనలు గుర్తుచేస్తున్నాయి. తాజాగా ఓ 85 ఏళ్ల వృద్ధుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
వివరాల్లోకి వెళితే... గురువారం ఉదయం కాన్పూరు నుంచి ఢిల్లీ వెళ్లే శతాబ్ధి ఎక్స్ప్రెస్లో ప్రయాణించేందుకు టికెట్ తీసుకున్నాడు 85 ఏళ్ల రామ్ అవధ్ దాస్ అనే పెద్దాయన. ఇక రైలు ఎక్కేందుకు ప్లాట్ ఫాం మీదకు చేరుకున్నాడు .ఇక్కడే అవధ్ దాస్ను రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. అవధ్ దాస్ ఒక దొంగ అనో.. లేక మరొక సంఘవిద్రోహ శక్తి అనో ఆయన్ను పోలీసులు అడ్డుకోలేదు..కేవలం ఆయన ధరించిన వస్త్రాలను ఆధారం చేసుకుని రైలు ఎక్కకుండా అడ్డుకున్నారు. ఇంతకీ ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించారో తెలుసా..?
దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 70ఏళ్లు పైన అయినా ఇంకా రైళ్లలోకి ఎక్కకుండా పోలీసులు అడ్డుకోవడం చూస్తే తనకు నాటి బ్రిటీష్ రాజ్యాన్ని గుర్తుకుతీసుకొస్తోందని అవద్ దాస్ అన్నారు. తాను ఒక ధోవతి ధరించి, ఓ బట్టను తన శరీరానికి చుట్టుకున్నట్లు రామ్ అవధ్ దాస్ చెప్పారు. ఇలాంటి దుస్తులు ధరించినందుకు తనను రైలు ఎక్కకుండా అడ్డుకున్నారని రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అవధ్ దాస్ పేర్కొన్నారు. తాను టికెట్ తీసుకున్నానని ఎంత ప్రాథేయపడ్డప్పటికీ పోలీసులు తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తను రిజర్వ్ చేసుకున్న కోచ్, సీటు నెంబరు కూడా చూపించాడు. ఇథావా నుంచి ఘజియాబాద్కు ఓ కార్యక్రమం నిమిత్తమై అవధ్ దాస్ బయలు దేరారు.
ఇదిలా ఉంటే అవధ్ దాస్ తాను ఎక్కాల్సిన కోచ్ కాకుండా మరో కోచ్ ఎక్కడంతో సిబ్బంది ఆయనకు వివరించే ప్రయత్నం చేశారని చీఫ్ పబ్లిక్ రిలిషన్ ఆఫీసర్ అజిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇక ఆ కోచ్ దిగి మరో కోచ్ వెళ్లేసరికి రైలు కదిలివెళ్లిపోయిందని ఆఫీసర్ తెలిపారు.అయితే ప్రయాణికుల పట్ల సిబ్బంది ఎలా వ్యవహరించాలో అనేదానిపై కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.