కరోనా బారినపడివారిలో 83శాతం మంది 50 ఏళ్ల లోపువారే: కేంద్రం
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనాసోకిన కేసుల్లో ఎక్కువగా 21-40 మంది వయస్కులే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. కరోనాసోకిన మొత్తం బాధితుల్లో 41 శాతం మంది 21-40ఏళ్ల వయస్కులే ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత 41-50 మధ్య వయస్సున్నవారు 33 శాతంగా ఉన్నారని వెల్లడించింది.
60 కంటే ఎక్కువ వయస్సున్నవారు 17శాతం ఉన్నారని తెలిపింది. వీరికి కరోనా సోకి తగ్గడం చాలా కష్టసాధ్యమైన విషయమని పేర్కొంది. 50ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు మొత్తం 83శాతం ఉన్నారని వెల్లడించింది. నావెల్ కరోనావైరస్ మనదేశంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పై ప్రభావం చూపుతోందని తెలిపింది.
కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మనదేశంలో ఇప్పటి వరకు 3113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 75 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 213 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు ఒక్కసారిగా మూడువేలు(3113) దాటడం గమనార్హం. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ కరోనావైరస్ విస్తరించిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసులు నమోదుయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ కరోనావైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో ఇప్పటి వరకు 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనావైరస్ సమూహ సంక్రమణ స్థాయికి ఇంకా చేరుకోలేదని, ప్రస్తుతం స్థానిక సంక్రమణలోనే ఉందని తెలిపారు. మొత్తం కేసుల్లో కేవలం 40 మందికి మాత్రమే స్థానికంగా ఈ వైరస్ సంక్రమించిందని చెప్పారు. మిగిలినవారంతా విదేశీ ప్రయాణాలు చేసినవారు లేదా నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.