రామ మందిరానికి 83 ఏళ్ల సాధువు రూ.1కోటి విరాళం... ఆశ్చర్యపోయిన బ్యాంకు సిబ్బంది...
అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిషికేశ్కి చెందిన 83 ఏళ్ల స్వామి శంకర్ అనే ఓ సాధువు రూ.1కోటి చెక్కును రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు వసూలు చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ పేరిట బ్యాంకులో ఆయన చెక్కును జమ చేశారు. నిజానికి బ్యాంకు అధికారులు ఆ చెక్కును చూసి ఆశ్చర్యపోయారు. ఆయన ఖాతాలో అంత డబ్బు ఉండి ఉంటుందా అని కాస్త సందేహించారు.
కానీ ఆ చెక్ వివరాలను ఒకసారి తనిఖీ చేసిన తర్వాత అందుకు తగిన మొత్తం ఆయన ఖాతాలో ఉన్నట్లు నిర్దారించుకున్నారు. అనంతరం స్థానిక ఆర్ఎస్ఎస్ యంత్రాంగానికి సమాచారం అందించడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. అందరి సమక్షంలో స్వామి శంకర్ దాస్ ఆ చెక్కును బ్యాంకు సిబ్బందికి ఇచ్చారు.
విరాళం అనంతరం స్వామి శంకర్ దాస్ మాట్లాడుతూ.. 'నేను గత అర్ధ శతాబ్ద కాలంగా రిషికేశ్లోని ఓ గుహలో నివసిస్తున్నాను. నావద్దకు వచ్చే భక్తులు నాకు విరాళాలు సమర్పిస్తుంటారు. ఎన్నో ఏళ్ల కల రామ మందిర నిర్మాణం కోసం వీహెచ్పీ విరాళాలు సేకరిస్తోందని తెలిసి... నేను కూడా విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.' అని తెలిపారు.
స్వామిక శంకర్ దాస్ విరాళంపై ఉత్తరాఖండ్కి చెందిన వీహెచ్పీ ఇన్చార్జి రణదీప్ పొఖ్రియా మాట్లాడుతూ... 'విరాళాల సేకరణ కంటే ప్రతీ రామ భక్తుడిలో స్వామి శంకర్ దాస్ లాగా సామరస్య భావాన్ని,సేవా గుణాన్ని పెంపొందించడమే మా క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం' అని చెప్పారు. ఇప్పటివరకూ ఉత్తరాఖండ్లో రూ.5కోట్లు విరాళాలు సేకరించినట్లు తెలిపారు. చిన్న పిల్లల నుంచి మొదలు వృద్దుల వరకూ ఎంతోమంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు.
ఉత్తరాఖండ్లో మొత్తం 14,526 గ్రామాలు,73 పట్టణాల్లో 24లక్షల కుటుంబాల నుంచి తాము విరాళాలు సేకరించనున్నట్లు ఇదివరకే వీహెచ్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.10 మొదలు రూ.2000 వరకూ కూపన్లతో భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు ప్రకటించింది.ఇటీవల 10 ఏళ్ల ఓ చిన్నారి తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.2500 రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.