నితీష్ ప్రభుత్వాన్ని 87 శాతం ప్రజలు కోరుకోవడం లేదు: ఆర్జేడీ తీవ్ర ఆరోపణలు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఆర్జేడీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఇక బీహార్ ప్రజలు కోరుకోవడం లేదని ఆర్జేడీ ఆరోపించింది. రాష్ట్రంలోని 87 శాతం మంది నితీష్ చెడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించింది. ఇది మీడియా సర్వే అంటూ ప్రచారం చేస్తోంది ఆర్జేడీ.
నితీష్ కుమార్ నాయకత్వాన్ని బీహార్పై బీజేపీ బలవంతంగా రుద్దుతోందని ఆరోపించింది. కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఆర్జేడీ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.
नहीं चाहिए कामचोर मक्खीमार सरकार!
— Rashtriya Janata Dal (@RJDforIndia) October 8, 2020
अबकी बनाएँगे प्रगतिशील विज़न वाली युवा तेजस्वी सरकार! pic.twitter.com/XHVz9FWTQG
లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో తేజస్వి యాదవ్ ఆర్జేడీ పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
వైశాలి జిల్లాలోని రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తేజస్వి యాదవ్ను ఓడించేందుకు అటు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఆర్జేడీ ఆరోపిస్తోంది. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలుపుకోసం బీజేపీ అహర్నిశలు కష్టపడుతోందని పేర్కొంది. కాగా, తేజస్వి యాదవ్కు ఈసారి ఎన్నికలో గెలుపు అంత సులువు కాదని ఓ సీనియర్ బీజేపీ నేత వెల్లడించారు.
मीडिया द्वारा करवाए सर्वे के अनुसार 87% बिहारवासी नीतीश कुमार जी की दुःशासनी राजनीति से सदा के लिए मुक्ति पाना चाहते हैं!
— Rashtriya Janata Dal (@RJDforIndia) October 8, 2020
फिर भी बेबस #बेशर्मBJP पलटू नीतीश को बिहार पर थोपने पर आमादा है!
बेबस #बेशर्मBJP सरकार हटाओ
युवा तेजस्वी सरकार बनाओ!
కాగా, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ను బీజేపీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ పార్టీ జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రి మాత్రం నితీష్ కుమారేనని తేల్చి చెప్పింది.
త్వరలో ముగియనున్న 243 సీట్ల అసెంబ్లీలో ఆర్జేడీకి 73, జేడీయూకు 69, బీజేపీకి 54, కాంగ్రెస్ పార్టీకి 23, సీపీఐఎంల్ 3, ఎల్జేపీ 2, హెచ్ఏఎంకు 1, ఏఐఎంఐఎంకు 1 సభ్యులు ఉన్నారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ.. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. నితీష్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన చిరాగ్.. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని, కేంద్రంలో మాత్రం ఎన్డీఏతో కలిసి పనిచేస్తామని చెప్పింది.