హమ్మయ్యా: కోటా టు యూపీ, స్వస్థలాలకు చేరుకున్న 9 వేల మంది విద్యార్థులు, 250 బస్సుల్లో..
హమ్మయ్యా.. రాజస్థాన్లోని కోటాలో చిక్కుకొన్న 9 వేల మంది విద్యార్థులు ఎట్టకేలకు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కోటాలో చదువుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల 9 వేల మంది అక్కడ చిక్కుకున్నారు. దీంతో పేరంట్స్ ఆందోళన చెందారు. మరోవైపు తమను స్వస్థలాలకు తీసుకెళ్లాలని విద్యార్థులు కూడా #SendUsBackHome పేరుతో సోషల్ మీడియోలో పోస్టులు పెట్టారు.
కోటా అనేది కోచింగ్ సెంటర్లకు పేరొందింది. అందుకోసమే ఇక్కడ చాలామంది శిక్షణ తీసుకుంటారు. యూపీకి చెందిన విద్యార్థులు కూడా ఇక్కడే చిక్కుకున్నారు. కోటాలో ఆరు పికప్ పాయింట్లను ఏర్పాటు చేసి.. విద్యార్థుల తరలింపు ప్రక్రియ చేపట్టారు. యూపీ నుంచి 250 బస్సులు రాగా.. ఒక్కో బస్సుల్లో 30 మంది వరకు ఎక్కించుకున్నారు.
విద్యార్థులు బస్సు ఎక్కే ముందు స్క్రీనింగ్ చేశారు. తర్వాత బస్సుల్లోకి అనుమతించారు. యూపీ నుంచి బస్సులు రాగా.. ఎందుకైనా మంచిదని రాజస్థాన్ ప్రభుత్వం మరో 100 బస్సులను కూడా సిద్దం చేసింది. ఆగ్రా నుంచి 150 బస్సులు, ఝాన్సీ నుంచి 100 బస్సులు పూర్వాంచల్ మీదుగా కోటా చేరుకున్నాయని యూపీ అధికారులు పేర్కొన్నారు. వీరిలో చాలామంది ఇంజినీరింగ్, మెడికల్ చదివే విద్యార్థులు అని పేర్కొన్నారు. యూపీకి చెందిన 9 వేల మందే కాక .. 32 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వివిధ హాస్టళ్లలో వారు ఉంటున్నారు. బీహార్ నుంచి 6 వేల 500, మధ్యప్రదేశ్ నుంచి 4 వేల మంది, జార్ఖండ్ నుంచి 3 వేల మంది, హర్యానా నుంచి 2 వేల మంది, మహారాష్ట్ర నుంచి 2 వేల మంది, పశ్చిమబెంగాల్ నుంచి వెయ్యి మంది, ఈశాన్య రాష్ట్రాల నుంచి వెయ్యి మంది వరకు ఉన్నారు.