సర్వే: పది మంది పిల్లల్లో ఒకరికే పౌష్టికాహారం
ఉత్తరప్రదేశ్లో ప్రతి పది మందిలో తొమ్మిది మందికి కూడా పౌష్టికాహారం లభించడం లేదు. పదింట కేవలం ఒక్క పసికందుకు మాత్రమే పోషకాహారం లభిస్తున్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది.
లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రతి పది మందిలో తొమ్మిది మందికి కూడా పౌష్టికాహారం లభించడం లేదు. పదింట కేవలం ఒక్క పసికందుకు మాత్రమే పోషకాహారం లభిస్తున్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ 2015 - 16) తేల్చింది. జాతీయస్థాయి ప్రమాణాల కంటే తక్కువగానే ఉత్తరప్రదేశ్ బాలలకు పోషకాహారం లభిస్తుండటం ఆందోళన కరమే మరి.
కాకపోతే దశాబ్దం క్రితం సర్వేతో పోలిస్తే ఒకింత మెరుగుదల సాధించినట్లు ఫలితాలు చెప్తున్నాయి. 6 - 23 నెలల పసికందులకు అందుతున్న పౌష్ఠికాహారం వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తున్నది. చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్వై) సర్వే ప్రకారం 5.3 శాతం బాలలు సరిపడా పోషకాహారం లభిస్తున్నది. దేశంలోకెల్లా పసికందులు అతి తక్కువ పోషకాహారం పొందుతున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది.
ప్రతి నలుగురిలో ముగ్గురికి అందని తల్లి పాలు
మరోవైపు తమిళనాట 31 శాతం మంది పసిబాలలకు పౌష్ఠికాహారం లభిస్తున్నది. యూపీలో తొలి ఆరు నెలలలో ప్రతి నలుగురిలో ముగ్గురు బాలలు తల్లి పాలు అందుకోలేకపోతున్నారు. గర్భవతులుగా ఉన్నప్పుడు ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోకపోతేనే ప్రత్యేక పౌష్ఠికాహారం పొందలేకపోవడంతో వారి బాలల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు తెలిపారు.
గర్భవతులు రక్షణ చర్యలు పొందనందు వల్లే..
మహిళలు గర్బవతులుగా ఉన్నప్పుడు సరైన ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే చిన్ననాడు బాలలకు సరైన పోషకాహారం లభించదని నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకమైన పౌషకాహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలకు తల్లులు పాలివ్వలేక వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సర్వే సారాంశం. ప్రారంభంలో ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకున్నా పూర్తిస్థాయిలో గర్భవతులుగా ఆరోగ్య, వైద్య సేవలు మాత్రమే పొందుతున్నారు. కేవలం 13 శాతం మంది మహిళలు వంద రోజుల నుంచి అత్యధిక కాలం పాటు ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు పొందగలుగుతున్నారని ఈ సర్వే చెప్తున్నది.
మూడోంతులు ఇళ్లలోనే ప్రసవాలు
మరో గమ్మత్తేమిటంటే మూడోవంతుకు పైగా జననాలు ఇప్పటికి ఉత్తరప్రదేశ్లో ఇళ్లలోనే జరుగుతున్నాయని అంటే రాష్ట్రంలో నెలకొన్న ఆరోగ్య, వైద్య వసతుల పరిస్థితులకు అద్ధం పడుతున్నది. గర్భం తర్వాత కూడా ఆరోగ్య జాగ్రత్తలపై రాజీ పడటం కూడా దీనికి మరో కారణంగా చెప్పవచ్చు. సరైన పోషకాహారం లేకపోవడంతో ఐదేళ్లలోపు బాలలు తక్కువ ఎత్తు, ఎత్తుకంటే తక్కువ బరువు, తక్కువ బరువు ఉంటున్నారని ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదిక చెప్తున్నది. ఐదేళ్లలోపు వారిలో 40 శాతం బాలలు ఇప్పటికి ఆరోగ్య ప్రమాణాల కంటే తక్కువ బరువు కలిగి ఉండటం ఆందోళనకరమే.
మూడింట రెండొంతుల బాలల్లో రక్త హీనత
బాలల్లో రక్త హీనత కూడా రోజురోజుకు పెరుగుతుండటం ఇబ్బందికర పరిణామం. 6 - 59 నెలల మధ్య బాలల్లో మూడింట రెండొంతుల మంది ఎనీమియాతో బాధ పడుతున్నారు. ప్రతి వెయ్యి మంది శిశు జననాల్లో 64 మరణిస్తుండగా, ఐదేళ్లలోపు వారిలో ప్రతి వెయ్యి మందికి 78 మంది మరణించడం ఆందోళనకరమైన అంశమే. బాలల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు టీకాలిచ్చే ప్రక్రియ సంస్థాగతంగా మెరుగవుతున్నది.