భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ .. రెండు రాష్ట్రాల్లో దాడులు .. 9 మంది ఉగ్రవాదులు అరెస్ట్
భారీ ఉగ్ర కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేసింది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దేశంలోని 12 రాష్ట్రాల్లో ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని పార్లమెంట్ లో మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే . ఉగ్రవాదం విస్తరిస్తున్న నేపధ్యంలో తాజాగా కేరళ, పశ్చిమ బెంగాల్లో పలు దాడులు నిర్వహించిన ఎన్ఐఏ తొమ్మిది అల్-ఖైదా ఉగ్రవాదులను ఈ ఉదయం అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది.
దేశంలో చాపకింద నీరులా టెర్రరిజం .. ఏపీ, తెలంగాణాతో పాటు 12 రాష్ట్రాల్లో చురుగ్గా ఐఎస్ కార్యాకలాపాలు
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలో ఎన్ఐఏ దాడులు
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, కేరళలోని ఎర్నాకుళంలో దాడులు చేసిన ఎన్ఐఏ కేరళలోని పదకొండు ప్రాంతాలలో తనిఖీలను నిర్వహించింది. పాకిస్థాన్ కు చెందిన అల్ ఖైదా ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా భారత్లోని ఉగ్రమూకను ప్రేరేపించిన ట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పశ్చిమ-బెంగాల్ , కేరళతో సహా భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో అల్-ఖైదా కార్యకర్తల అంతర్-రాష్ట్ర ఉగ్రవాదుల మూమెంట్స్ గురించి గురించి ఎన్ఐఏ తెలుసుకుంది.
బెంగాల్ లో ఆరుగురు, కేరళలో ముగ్గురు అరెస్ట్ .. అల్ ఖైదా ఉగ్రవాదులుగా గుర్తింపు
అమాయక ప్రజలను చంపి దేశంలో శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసి, ఘర్షణలు రేకెత్తించాలనే లక్ష్యంతో భారతదేశంలో కీలకమైన ప్రాంతాలలో ఉగ్రవాద దాడులను చేపట్టాలని ఈ బృందం సిద్ధమవుతున్నట్లుగా గుర్తించింది. ఆరుగురు ఉగ్రవాదులను బెంగాల్ నుంచి అరెస్టు చేయగా, తెల్లవారుజామున జరిగిన దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులను కేరళ నుంచి అరెస్టు చేసినట్లు తెలిపింది. అరెస్టు చేసిన వ్యక్తులు అందరూ సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు చెందిన అల్-ఖైదాతో ప్రభావితం అయ్యి ఉగ్రవాదులుగా మారారని ఢిల్లీతో సహా దేశంలో ఆరు చోట్ల దాడులు చేయడానికి ప్రేరేపించబడ్డారు అని ఎన్ఐ ఏ పేర్కొంది.
ఆల్-ఖైదా టెర్రరిస్టుల అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల కార్యాకలాపాలపై దర్యాప్తు
ఉగ్రవాదుల వద్ద నుండి డిజిటల్ పరికరాలు, పత్రాలు, జిహాదీ సాహిత్యం, పదునైన ఆయుధాలు, దేశీయంగా తయారు చేసిన తుపాకీలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బాంబుల తయారీకి కావలసిన మెటీరియల్, వాటి తయారీ కోసం కావాల్సిన పుస్తకాలు, సాహిత్యాలతో సహా పెద్ద మొత్తంలో మెటీరియల్ ను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లుగా ఎన్ఐఏ పేర్కొంది. దేశంలో ఉన్న ఆల్-ఖైదా టెర్రరిస్టుల అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు నిధుల సేకరణలో కూడా చురుగ్గా పాల్గొంటున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాదు కొందరు ఆయుధాలను సమకూర్చుకోవడానికి, మరికొందరు పేలుడు పదార్థాలను సమకూర్చుకోవడానికి ఢిల్లీకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Recommended Video
కోర్టులో హాజరుపరచే అవకాశం .. ఇతర రాష్ట్రాలలోనూ దాడులు చేసే ఛాన్స్
ఈరోజు అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు ముర్షిద్ హసన్, ఇయాకుబ్ బిస్వాస్, మొసారఫ్ హోసెన్, నజ్ముస్ సాకిబ్, అబూ సుఫియాన్, మెనుల్ మొండల్, ల్యూయేన్ అహ్మద్, అల్ మామున్ కమల్ మరియు అతితుర్ రెహ్మాన్ లను కోర్టులో హాజరు పరచనున్నారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ మొత్తం 12 రాష్ట్రాలలో ఉగ్రవాదులు అత్యంత చురుకుగా ఉన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇక మిగతా రాష్ట్రాలలో కూడా దాడులకు ఉపక్రమించే అవకాశం లేకపోలేదు .