ఐక్యతా ర్యాలీలో 9 మంది ప్రధాని అభ్యర్థులు ఉన్నారు: మమతపై నిప్పులు చెరిగిన అమిత్ షా
20 నుంచి 25 మంది నాయకులు చేతులు కలిపినంత మాత్రాన ప్రధాని నరేంద్ర మోడీని ఏమీ చేయలేరని ఆయన వెనక 100 కోట్ల మంది ప్రజలు చేతులు కలిపి నిలుచున్నారని అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఐక్యతా ర్యాలీ ముగిసిన మూడురోజుల్లోనే అదే బెంగాల్ గడ్డపై నుంచి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు అమిత్ షా. మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన బీజేపీవ్యతిరేక ర్యాలీలో మొత్తం 9 మంది ప్రధాన మంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు.
మహాగట్భంధన్ అంటే ఏమిటి అని ప్రశ్నించిన అమిత్ షా... విపక్షాల నేతలు కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నారని విమర్శించారు. వారు ఏనాడు వందేమాతరం కానీ , భారత్ మాతాకీ జై అని కానీ అనరు అని షా ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్లోకి అక్రమవలసదారులు రాకుండా ఉండాలంటే వాటిని అరికట్టే నిఖార్సు అయిన పార్టీకే ఓటు వేయాల్సిందిగా కోరారు. అంతేకాదు మమతా బెనర్జీ సిటిజెన్షిప్ బిల్ పై కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. కచ్చితంగా మమతా బెనర్జీ బిల్లును వ్యతిరేకిస్తుందని జోస్యం చెప్పిన అమిత్ షా... ఆమెకు ఓటుబ్యాంకు మాత్రమే ముఖ్యమని ధ్వజమెత్తారు. బెంగాల్ సంస్కృతిని మమతా ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని తీవ్ర ఆరోపణలు చేసిన అమిత్ షా... 2019 లోక్సభ ఎన్నికలు మమత సర్కారు రాష్ట్రంలో ఉండాలా లేదా అనేది నిర్ణయిస్తాయని చెప్పారు.
ఒకప్పుడు బెంగాల్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండేదని చెప్పిన అమిత్ షా.... ఇప్పుడు అట్టడుగు రాష్ట్రాల జాబితాలో ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనం ఇక్కడి ఉద్యోగులు పొందలేకపోతున్నారని చెప్పారు అమిత్ షా. మరి ఖజానాకు అంత డబ్బులు వస్తుంటే అది ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు అమిత్ షా. అందుకే కమ్యూనిస్టుల ప్రభుత్వ పాలనలోనే సంతోషంగా ఉండేవారమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని చెప్పారు. బీజేపీ అంటే మమతా సర్కార్కు భయం పుట్టుకుందని అందుకే బెంగాల్లో రథయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. పరిపాలనలో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయని అందుకే తాను ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్కు అనుమతులు లేకుండా చేశారని ధ్వజమెత్తారు అమిత్ షా.