పునర్వ్యస్థీకరణ: మోడీ కొలువులోకి 9 మంది కొత్తవారు వీరే
ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఉదయం 10 గంటలకు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టనున్నారు. కొత్తగా మోడీ కొలువులో చేరేవారి పేర్లు ఖరారైనట్లు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఉదయం 10 గంటలకు మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టనున్నారు. కొత్తగా మోడీ కొలువులో చేరేవారి పేర్లు ఖరారైనట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంత వరకు స్పష్టత రాలేదని అంటున్నారు. కానీ విశాఖపట్నం బిజెపి పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది
భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు అశ్విని కుమార్ చౌబే (బీహార్), శివప్రతాప్ శుక్లా (ఉత్తరప్రదేశ్), వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్) రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. అనంతకుమార్ హెగ్డే, రాజ్ కుమార్ సింగ్, హరదీప్ సింగ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్,సత్యపాల్ సిగ, అల్ఫోన్స్ కన్ననతనం రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఆదివారంనాడు ఆరుగురు మంత్రులు రాజీనామా చేశారు. నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత రెండుసార్లు మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించారు. మూడోసారి రేపు ఆదివారం పునర్వ్యస్థీకరించబోతున్నారు.
ప్రస్తుతం ప్రధానితో కలిసి 73 మంది మంత్రులు ఉన్నారు ఆ సంఖ్య 81 మించకూడదు. రాజ్యాంగ నిబంధన ప్రకారం మొత్తం పార్లమెంటు సభ్యులు 545 మందిలో 15 శాతానికి మాత్రమే మంత్రివర్గాన్ని పరిమితం చేయాల్సి ఉంటుంది.