రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం
చెన్నై: తమిళనాడులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది ప్రాణాలు అక్కడికక్కడే గాలిలో కలిసి పోయాయి. తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలో యమరాయుడి రూపంలో వచ్చిన లారీ నిలిపి ఉన్న వ్యాన్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
సోమవారం ఉదయం తూత్తుకూడి సమీపంలో రోడ్డు పక్కన వ్యాన్ నిలిపి ఉన్నారు. వ్యాన్ లో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అదే సమయంలో అటు వైపు లారీ వెళ్లింది. వేగంగా వెళ్లి నిలిపి ఉన్న వ్యాన్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న తొమ్మిది మంది సంఘటనా స్థలంలో మరణించారు
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలైన 11 మందిని ఆంబులెన్స్ ల్లో తూత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహ నలుగురు మహిళలు మరణించారని స్థానిక పోలీసులు చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే లాడీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనాడు. అతి వేగంగా, నిర్లక్షంగా లారీ నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి పేర్లు, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.