ఉత్తర్ ప్రదేశ్లో నాటు తుపాకులతో కాల్పులు: 9 మంది మృతి
వారణాశి: ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ వివాదం కారణంగా చోటు చేసుకున్న ఘర్షణ తొమ్మిదిమంది గ్రామస్తుల ప్రాణాలను హరించి వేసింది. ఈ ఘర్షణల్లో మరో 25 మంది గాయపడ్డారు. వారంతా వారణాశిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్ సోన్భద్ర జిల్లాలోని ఘొరావాల్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘొరావాల్ గ్రామంలో కొంతకాలంగా రెండు వర్గాల మధ్య భూవివాదం నడుస్తోంది. అది కాస్త తీవ్రరూపం దాల్చింది. ఈ మధ్యాహ్నం మరోసారి రెండు వర్గాల వారు ఈ వివాదంపై పెద్ద ఎత్తున ఘర్షణకు దిగారు. వారిలో కొందరు నాటు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చూస్తూ, చూస్తూనే తొమ్మిది మంది సంఘటనాస్థలంలోనే నేలకొరిగారు. 25 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘొరావాల్ గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని వారణాశి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సోన్భద్ర జిల్లా కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించారు. ఈ ఘటనలో ఘోరావాల్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పికెటింగ్ను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ను విధించారు.