ప్రభుత్వ పాఠశాలలో పాము కరిచి విద్యార్థిని దుర్మరణం: పాము కాటేసిందని చెబితే.. నవ్విన టీచర్..!
తిరువనంతపురం: కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పాము కాటేయడం వల్ల ఓ విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. తనను పాము కాటేసిందని బాధిత విద్యార్థిని ఉపాధ్యాయుడికి చెప్పినప్పటికీ.. ఆయన నమ్మలేదు. పైగా నవ్వుకున్నారు. దీనివల్ల 45 నిమిషాల పాటు జాప్యం చేసింది. దీనితో విద్యార్థిని పరిస్థితి విషమించింది. శరీరం రంగు మారిపోతుండటాన్ని గమనించిన ఉపాధ్యాయిని అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించగా.. ఫలితం లేకుండా పోయింది.
ఆ విద్యార్థిని పేరు షెహ్లా షెర్లిన్. వయస్సు 10 సంవత్సరాలు. వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బథేరి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు అబ్దుల్ అజీజ్, షజ్నా సుల్తాన్ బథేరీలోనే న్యాయవాదులుగా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం షెర్లిన్.. ఎప్పట్లాగే పాఠశాలకు హాజరయ్యారు. కేరళలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాఠశాలలోని పలు తరగతి గదులు కుంగిపోయాయి. కొన్నింట్లో రంధ్రాలు ఏర్పడ్డాయి.
షెర్లిన్ చదువుకుంటున్న తరగతి గది ఫ్లోర్ కు కూడా రంధ్రాలు ఉన్నాయి. క్లాస్ జరుగుతున్న సమయంలో ఫ్లోర్ రంధ్రంలో నుంచి వచ్చిన ఓ పాము షెర్లిన్ ను కాటేసి, అదే రంధ్రం నుంచి వెళ్లిపోయింది. పాము తనను కాటేసిన వెంటనే షెర్లిన్ గట్టిగా కేకలు వేస్తూ ఈ విషయాన్ని క్లాస్ టీచర్ షాజీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని టీచర్ నమ్మలేదు. పాము ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. పాము కాటేసిందంటే తొలుత నవ్వుకున్నారు.
21 ఏళ్ల వయస్సులోనే..న్యాయమూర్తి పదవికి: దేశంలోనే యంగెస్ట్ జడ్జిగా
షెర్లిన్ పదే పదే అదే విషయాన్ని చెప్పడంతో కరిచిన చోట చూడగా.. పాము కాట్లు కనిపించాయి. ఆ తరువాత కూడా ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలించడంలో జాప్యం చేశారు. ఫలితంగా పాఠశాలలో ఉండగానే ఆ బాలిక శరీరం రంగులు మారింది. దీనితో అప్పటికప్పుడు ప్రైవేటు వాహనంలో సుల్తాన్ బథేరీ సమీపంలోని వైథెరి తాలూకా ఆసుపత్రికి తరలించారు. షెర్లిన్ ను పరిశీలించిన డాక్టర్లు.. చేతులెత్తేశారు. ప్రాణాపాయం నుంచి కాపాడే దశ దాటిపోయిందని, వెంటనే కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
దీనితో పాఠశాల సిబ్బంది షెర్లిన్ ను కోజికోడ్ వైద్య కళాశాలకు తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ షెర్లిన్ మరణించారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మోహనన్ వయనాడ్ జిల్లా పాలనా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనిపై రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వయనాడ్ జిల్లా కలెక్టర్ అదీలా అబ్దుల్లా తెలిపారు. 45 నిమిషాల పాటు జాప్యం చేయడం వల్ల విషం షెర్లిన్ శరీరం మొత్తాన్ని వ్యాపించిందని, జాప్యం ఎక్కడ జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నామని అన్నారు.