భగ్గుమన్న జంతుప్రేమికులు: 90 కుక్కల కాళ్లు కట్టేసి అత్యంత దారుణంగా చంపేశారు..!
మహారాష్ట్ర: మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దాదాపు 90 వీధికుక్కల కాళ్లు కట్టివేయబడి చంపివేసిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఎవరో ఈ కుక్కలను చంపేసి గిర్దా- సవల్దబారా రోడ్డులో అక్కడక్కడ పడివేశారని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతమంతా అటవీప్రాంతమని వారు చెప్పారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
దాదాపు 100 కుక్కల కాళ్లకు తాడుతో కట్టేసి పడేశారని అందులో 90 కుక్కలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీటన్నిటినీ 5 ప్రదేశాల్లో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. కుక్కుల మృతి చెందడంతో దుర్వాసన వచ్చిందని దీంతో అసలు విషయం వెలుగుచూసినట్లు పోలీసులు చెప్పారు. దుర్వాసన రావడం గమనించిన కొందరు గ్రామస్తులు అటవీశాఖ సిబ్బంది దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అటవీశాఖ సిబ్బంది కొన్ని కుక్కలు బతికే ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆ కుక్కల కాళ్లకు కట్టేసిన తాడును తీసి వాటికి విముక్తి కల్పించారు.
జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం కింద పోలీసులు కేసును నమోదు చేశారు. అంతే కాదు ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఫారెస్టు గార్డ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని చెప్పిన పోలీసులు నిందితులను పట్టకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. నగర పరిధిలో ఉన్న కుక్కలను పట్టుకుని వాటి కాళ్లను కట్టేసి ఆ పై చంపేసి ఉంటారనే అనుమానంను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత కుక్కల కళేబరాలను అటవీప్రాంతంలో విసిరేశారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు భగ్గుమన్నారు. మూగజీవులను చంపినవారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.