90శాతం మంది మగాళ్లు ఇతరుల భార్యలతో డేటింగ్ చేస్తున్నారు: తప్పులేదన్న సిఎం
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. కేవలం 10శాతం మంది మగాళ్లు మాత్రమే తమ భార్యలతో కలిసి బయటకు వెళుతున్నారని, మిగితా 90శాతం మంది పురుషులు ఇతరుల భార్యలతో డేటింగ్ చేస్తున్నవారేనని వ్యాఖ్యానించారు.
అంతేగాక, పరస్పర అంగీకారం ఉంటే ఇలాంటి విషయాలు ఎంతమాత్రం తప్పుకాదని పేర్కొన్నారు. ‘2 నుంచి 5శాతం మంది పురుషులు మాత్రమే తమ భార్యలతో గడుపుతున్నారు. మిగితా వారందరూ ఇతరుల భార్యలతో డేట్ చేస్తున్నారు. ప్రియురాలు ఉండటం పెద్ద తప్పేం కాదు.' అని స్పష్టం చేశారు.
‘ఒకవేళ పాట్నా ఇకో పార్కుకు వెళితే అక్కడ అవివాహితులే కాక, వివాహమైన జంటలు కూడా కనిపిస్తాయి. ఇద్దరు మేజర్లయినప్పుడు వారు శరీరక సంబంధాలు ఏర్పర్చుకోవడంలో తప్పులేదు. అది వ్యక్తిగత విషయం.' అని ముఖ్యమంత్రి మాంఝీ తేల్చేశారు.
ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాంఝీకి కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చాలాసార్లు చేశారు. ఇండియా టుడే కథనం ప్రకారం.. ‘బ్లాక్ మార్కెటింగ్ విషయంలో పేదలకు తక్కువ శిక్ష సరిపోతుంది. ధనవంతులకు మాత్రం భారీ శిక్షలు వేయాలి' అని మాంఝీ వ్యాఖ్యానించారు.
గతంలో మాంఝీ మాట్లాడుతూ.. చిన్న వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే తప్పులేదని.. వారికి శిక్షలు ఉండవని హామీ ఇచ్చారు. చిన్న వ్యాపారులు చేసే బ్లాక్ మార్కెట్ డిమాండ్, సప్లైల మీద ఎక్కువగా ప్రభావం చూపదని కూడా విశ్లేషించారాయన. ఓ వైపు విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాంఝీపై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.