ఢిల్లీలో దారుణం... 90 ఏళ్ల వృద్దురాలిపై 33 ఏళ్ల ప్లంబర్ అత్యాచారం...
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 90 ఏళ్ల ఓ వృద్దురాలిపై 33 ఏళ్ల ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నజఫ్గర్లోని చావ్లా ప్రాంతంలో సోమవారం (సెప్టెంబర్ 7) సాయంత్రం ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... చావ్లా ప్రాంతంలో నివాసముండే ఓ వృద్దురాలు సోమవారం సాయంత్రం 5గంటల సమయంలో తమ ఇంటి గడప ముందు నిలబడి పాలు పోసే వ్యక్తి కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో అటుగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తి... ఈరోజు పాలు పోసే వ్యక్తి రావట్లేదని చెప్పాడు. అంతేకాదు,దగ్గరలోనే తనకు తెలిసిన మరో పాల వ్యాపారి ఉన్నాడని... అక్కడికి వెళ్తే పాలు దొరుకుతాయని చెప్పాడు.
ఆ మాటలు నమ్మి వృద్దురాలు అతని వెంట వెళ్లింది. కానీ అతను ఆ వృద్దురాలిని మరో చోటుకు తీసుకెళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న ఓ పంట పొలం వద్దకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 'వయసులో నీకు నానమ్మ లాంటి దాన్ని.దయచేసి నన్ను వదిలిపెట్టు...' అని ఆ వృద్దురాలు ఎంతగా బతిమాలినా అతను వినిపించుకోలేదు. అయితే వృద్దురాలి కేకలు అటుగా వెళ్తున్న కొంతమంది గ్రామస్తులకు వినబడటంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే అటువైపు పరిగెత్తి చూడగా... వృద్దురాలు తీవ్ర రక్తస్రావంతో కనిపించింది. అక్కడే ఉన్న దుండగుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ మీనా మాట్లాడుతూ... వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఓ ప్లంబర్గా గుర్తించినట్లు తెలిపారు.వృద్దురాలికి తీవ్ర రక్తస్రావమైందని... జరిగిన సంఘటన ఆమెను భయోత్పాతానికి గురిచేసిందని అన్నారు. అత్యాచారం సమయంలో వృద్దురాలిపై అతను విచక్షణారహితంగా దాడి కూడా చేసినట్లు చెప్పారు. స్థానికులు అతన్ని పట్టుకుని తమకు సమాచారం అందించారని చెప్పారు. ప్రస్తుతం అతను తమ అదుపులోనే ఉన్నట్లు తెలిపారు.
బాధితురాలి ఇంటికి 2కి.మీ దూరంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. నిందితుడికి గతంలో ఎలాంటి నేరపూరిత చరిత్ర లేదని గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మంగళవారం బాధితురాలు డిశ్చార్జి అయినట్లు చెప్పారు.
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ మాలివల్ మాట్లాడుతూ... ఆరేళ్ల బాలిక నుంచి 90ఏళ్ల వృద్దురాలి వరకూ ఢిల్లీలో ఎవరికీ భద్రత లేదన్నారు. వృద్దురాలికి తాము అండగా ఉంటామని... ఈ కేసులో ఆర్నెళ్ల లోపు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.