ఆ హాస్పిటల్లో ఒక్క నెలలోనే 91 మంది శిశువులు మృతి..విచారణకు ప్రభుత్వం ఆదేశం
కోటా: రాజస్థాన్లో అప్పుడే పుట్టిన శిశువులు మృతి చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. రాజస్థాన్ కోటాలోని జేకే లోన్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
గత ఐదు రోజుల్లో డజనుకు పైగా చిన్నారులు మృతి
రాజస్థాన్లో శిశు మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జేకే లోన్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువుల మరణాల సంఖ్య పెరుగుతోంది. చికిత్స పొందుతుండగానే గత ఐదు రోజుల్లో డజనుకు పైగా చిన్నారులు మృతి చెందడం గెహ్లాట్ ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఒక్క డిసెంబర్ నెలలో గత శుక్రవారం వరకు ఆ ఒక్క హాస్పిటల్లోనే 77 మంది శిశువులు మృతి చెందారు. ఒక వారంలో 12 మంది చిన్నారులు మృత్యువాత పడగా ఈ ఏడాది మొత్తంలో 940 మంది శిశు మరణాలు నమోదయ్యాయి.
విచారణకు హైలెవెల్ కమిటీ నియమించిన గెహ్లాట్ సర్కార్
ఇక రోజురోజుకూ పెరుగుతున్న పసిబిడ్డల మరణాలతో రాజస్థాన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. పసిబిడ్డలు ఎందుకు మృతి చెందుతున్నారో.. వారి మృతికి కారణాలేంటో వెంటనే సమగ్ర విచారణ చేసి త్వరతగతిన నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా వైద్యులు, సబ్జెక్ట్ నిపుణులు ఉన్నారు. ఇలాంటి మరణాలు ఇక భవిష్యత్తులో ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం హైలెవెల్ కమిటీని వేసింది. డాక్టర్ అమర్జీత్ మెహతా, డాక్టర్ రాంబాబు శర్మ, డాక్టర్ సునీల్ భట్నాగర్లతో కూడిన త్రిసభ్య కమిటీ రెండు రోజుల్లో రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించనుందని రాజస్థాన్ మెడికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వైభవ్ గలేరియా చెప్పారు.
హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత..టెండర్ల ప్రకియకు ఆదేశం
అయితే హాస్పిటల్లో సరైన వసతులు, ఎక్విప్మెంట్లు లేని కారణంగానే శిశువులు మృతి చెందుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్ కొరత ఉండటం, వార్డుల్లో ఇన్ఫెక్షన్లు కలిగి ఉండటం, అందుబాటులో సరైన మెడికల్ ఎక్విప్మెంట్ లేకపోవడం శిశువుల మృతికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు అన్ని వనరులను వినియోగించుకుని చికిత్స కోసం వస్తున్న చిన్నారులకు మంచి వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక హాస్పిటల్కు కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని గెహ్లాట్ సర్కార్ ఆదేశించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు ఆక్సిజన్ సరఫరా జరిగేలా చర్యలు వెంటనే తీసుకోవాలని ఇందుకోసం పైపులను బిగించాలని ఆదేశించింది. అంతేకాదు నర్స్ల సంఖ్యను కూడా పెంచేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నర్సుల నియామకం చేపట్టాలని సూచించింది.
గోరఖ్పూర్లో చిన్నారుల మృతి ఘటన మరువకముందే...
ఇదిలా ఉంటే జేకో లోన్ హాస్పిటల్ కోటా-బుంది పార్లమెంటరీ నియోజకవర్గంలోనే అతిపెద్ద హాస్పిటల్గా గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గానికి లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న బీఆర్డీ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరతతో 63 మంది చిన్నారులు మృత్యువాత పడిన విషయం మరవక ముందే జేకే లోన్ హాస్పిటల్లో చిన్నారులు మృతి చెందడం కలవరపాటుకు గురిచేస్తోంది.