మోడీకే దేశ ప్రజల ఓటు.. ఎందులో తెలుసా.. సర్వే చెప్పిన నిజమేంటి..?
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశాన్ని కరోనావైరస్ కబళిస్తున్న వేళ మోడీ సర్కార్ పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు సార్లు లాక్డౌన్ పొడిగించి ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం ఏదీ కాదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. ఇక కోవిడ్-19పై పోరులో ప్రధాని మోడీ చేస్తున్న కృషిని చాలామంది భారతీయులు అభినందిస్తున్నారు. ఒక్క మనదేశంలోనే మోడీకి జైజైలు పలకడం లేదు ప్రజలు.. పలు ప్రపంచ దేశాల ప్రజలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా నరేంద్రుడి పనితీరును ప్రశంసించాయి. తాజాగా కోవిడ్-19పై పోరుకు మోడీ తీసుకున్న చర్యలు భేష్ అని 93.5 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది.
మార్చి 25న 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన మోడీ సర్కార్ అనంతరం మే 3వరకు పొడిగిస్తూ రెండో సారి నిర్ణయించారు. ఇదంతా దేశ ప్రజల ఆరోగ్యం కోసమే అని ప్రధాని మోడీ చెప్పారు. ఈ క్రమంలోనే ఐయాన్స్-సీఓటర్ కోవిడ్ 19 ట్రాకర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తొలి లాక్డౌన్ సందర్భంగా 76.8శాతం మంది ప్రజలు నమ్మకం ఉంచారు. ఇప్పుడు ఆ నమ్మకం మరింత పెరిగి ఏప్రిల్ 21నాటికి 93.5శాతంకు పెరిగింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 21వరకు కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అనుకుంటున్నారనే ప్రశ్నను ప్రజల ముందు ఉంచారు. దీనికి 93.5శాతం మంది బాగుందనే సమాధానం ఇచ్చినట్లు సర్వే వెల్లడించింది.
ఈ కష్ట సమయంలో మోడీ ప్రభుత్వ పనితీరు బాగా ఉందని ప్రజలు భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ప్రధాని మోడీ దేశ ప్రజలను సురక్షితంగా కాపాడుకుంటున్నారని అదే సమయంలో ప్రపంచదేశాలకు కూడా సహాయం చేయడంలో ముందున్నారని అమిత్ షా కొనియాడారు.
Recommended Video
ఇక ఏప్రిల్ 16వరకు 75.8శాతం మంది ప్రజలు మోడీ పనితీరును మెచ్చుకుని నమ్మకం ఉంచగా... రెండో సారి దేశం లాక్డౌన్లోకి వెళ్లగా ప్రజల్లో మరింత విశ్వాసం ఏర్పడిందని సర్వే చెప్పింది. మొత్తం మీద ఏప్రిల్ 1నాటికి మోడీ సర్కార్పై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని సర్వే వెల్లడించింది. అదే సమయంలో మార్చి 31తో పోలిస్తే 89.9శాతం పెరుగుదల కనిపించిందని సర్వే వెల్లడించింది.