రిపోర్ట్: ప్రతి రోజు 93 మంది మహిళలపై రేప్, ఢిల్లీ ఫస్ట్
చెన్నై: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులు నిరోధించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. మనదేశంలో మహిళలకు సరైన భద్రత లేకుండా పోతోంది. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేను పరిశీలిస్తే ఇది నిజమేనని తెలుస్తుంది. ప్రతి రోజూ సగటున 93 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన తాజా నివేదికలో వెల్లడించింది.
2012లో మన దేశంలో 24,923 అత్యాచారాలు జరుగగా.. 2013లో ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగించేదిగా మారింది. గత సంవత్సరంలో 33,707 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం కఠిన చట్టాలు రూపొందించినా మహిళలకు సరైన భద్రత కల్పించలేకపోతున్నామనే వాస్తవాన్ని ఈ నివేదిక వెల్లడిస్తోంది.
2012లో ఢిల్లీలో 585 అత్యాచార కేసులు నమోదు కాగా, 2013లో 1,441 కేసులు అంటే క్రితం ఏడాది కంటే రెట్టింపు కావడం ఆందోళన కలిగించే విషయం. మనదేశంలో మహిళలకు భద్రత లేని నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ముంబై, జైపూర్, పుణెలు ఉన్నాయి.
2013లో రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే మధ్యప్రదేశ్లో అత్యధికంగా 4,335 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్లో 3,285, మహారాష్ట్రలో 3,063, ఉత్తరప్రదేశ్లో 3,050, తమిళనాడులో 923 అత్యాచార కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారని నివేదిక వెల్లడించింది. నేరాలకు పాల్పడుతున్న వారిలో 94శాతం మంది పరిచయం ఉన్నవారేనని పేర్కొంది.