94శాతం ఇంజినీర్లు ఉద్యోగాలకు పనికిరారు: టెక్ మహీంద్రా సీపీ గుర్నానీ సంచలనం
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారిలో 94శాతం మంది ఉద్యోగాలకు అనర్హులుగా ఉంటున్నారని టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం యాస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం కూడా ఈ మేరకు వెల్లడించడం గమనార్హం.
అయితే, టీవీ మోహన్దాస్, కిరణ్ మజుందార్ షా లాంటి ప్రముఖులు ఈ అధ్యయనాన్ని కొట్టిపారేశారు. కాగా, ఇప్పుడు టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం చర్చనీయాంశంగా మారింది. కేవలం 6శాతం మంది ఇంజినీర్లకు మాత్రమే ఉద్యోగానికి అవసరమయ్యే నైపుణ్యాలు ఉంటున్నాయని ఆయన స్పష్టం చేశారు.
94శాతం మంది నిరుపయోగం
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్నానీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘టాప్ టెన్ ఐటీ కంపెనీలు కేవలం 6శాతం మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తీసుకుంటున్నాయి. మిగతా 94శాతం మందికి ఏమైంది?' అని ప్రశ్నించారు. ఇప్పుడొస్తున్న ఇంజినీర్లలో నైపుణ్యాల కొరత ఉందని.. అందుకే ఐటీ పరిశ్రమ వారికి మళ్లీ శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
పరిశ్రమకు పెను సవాల్
‘60శాతం మార్కులు సాధించిన ఓ ఇంటర్ విద్యార్థి ఈ రోజుల్లో బీఏ ఇంగ్లిష్ కోర్సులో చేరలేడు. కానీ, కచ్చితంగా ఇంజినీరింగ్ కోర్సుకు వెళ్తాడు. ఇలా మనమే నిరుద్యోగులను తయారుచేయట్లేదా? భారత ఐటీ పరిశ్రమకు నైపుణ్యాలు కావాలి. 2022 నాటికి సైబర్ సెక్యూరిటీలో 60లక్షల ఉద్యోగులు అవసరమని నాస్కామ్ చెప్పింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నైపుణ్యాల కొరత ఉంది. ఇది పరిశ్రమకు పెను సవాల్గా మారుతోంది' అని గుర్నానీ అన్నారు.
4.77శాతం మాత్రమే..
గత సంవత్సరం యాస్పైరింగ్ మైండ్స్ అధ్యయనం కూడా దాదాపు ఇదే చెప్పింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారిలో కేవలం 4.77శాతం మంది మాత్రమే ఒక ప్రొగ్రామ్కు సరైన లాజిక్ రాయగలుగుతున్నారని పేర్కొంది. అయితే ఇందుకు కారణాలు కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నాణ్యమైన విద్య అందడం లేదు
ఐఐటీ, ప్రతిష్ఠాత్మక టెక్నాలజీ ఇనిస్టిట్యూట్లను మినహాయిస్తే.. దాదాపు అన్ని ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థులకు నాణ్యమైన, ఉద్యోగానికి అవసరమైన విద్యను అందించలేకపోతున్నాయి. అలాంటి కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన ఉద్యోగాలు లభించట్లేదు. అయితే గత కొద్ది రోజులుగా ఈ పరిస్థితుల్లో కాస్త మార్పొస్తున్నట్లు కన్పిస్తోంది. తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు నేటి యువత కాస్త మొగ్గుచూపడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.