తబ్లిఘికి వచ్చిన 960 మంది విదేశీయుల వీసాలు రద్దు, బ్లాక్ లిస్టులోకి..: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీ తబ్లిఘి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. అంతేగాక, వారి పాస్ పోర్టులను బ్లాక్ లిస్టులో పెడుతూ కేంద్రం హోంశాఖ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ విదేశీయులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పర్యాటక వీసాలపై వచ్చిన ఈ విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
విదేశీయుల చట్టం-1946, విపత్తు నిర్వహణ చట్టం-2005ను వారు ఉల్లంఘించి ఢిల్లీ నిజాముద్దీన్లోని తబ్లీఘీ జమాత్ మత కార్యక్రమంలో పాల్గొనడంతో వీరిపై చర్యలు తీసుకోవాలని వివిధ రాష్ట్రాల డీజీపీలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
కాగా, ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ మర్కజ్ దేశంలో కరోనా వైరస్ హాట్ స్పాట్గా మారిన విషయం తెలిసిందే. మర్కత్కు వెళ్లివచ్చిన వారి కారణంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 400 కేసులకుపైగా తబ్లిఘీ జమాత్ తో సంబంధం ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనావైరస్ సోకిన విదేశీయులు మర్కత్ జమాత్ కు హాజరవడంతోనే మనదేశ ముస్లింలకు వైరస్ సోకడం గమనార్హం. ప్రస్తుం భారతదేశంలో 2వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకడంతో 50కిపైగా మరణాలు సంభవించాయి.