99 మంది వైద్యులు వీరమరణం: కరోనా రోగులకు వైద్యం చేస్తూ మృత్యువాత, 1302 మందికి పాజిటివ్..
కరోనా రక్కసి ఎవరినీ వదలడం లేదు. వ్యాధితో బాధపడుతోన్న వైద్యులు/సిబ్బందిని కూడా బలి తీసుకుంటుంది. ఇప్పటివరకు 99 మంది వైద్యులు కరోనా వైరస్ సోకి చనిపోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్ సోకిన వారి సంఖ్య 1302కి చేరిందనే అంశం కాస్త కలవరానికి గురిచేస్తోంది. అయితే వైద్య సిబ్బంది మృతుల సంఖ్య 8 శాతంగా ఉంది. ఇక మహారాష్ట్రలో అయితే వైద్యులు ఎక్కువమంది చనిపోయారు. 20 శాతం మంది వైద్యులు చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇలాగైతే దేవుడు కూడా కాపాడలేడు... సెప్టెంబర్ కల్లా పీక్ స్టేజెస్కు కరోనా..!
74 శాతం వీరే..
99 మంది వైద్య సిబ్బంది మరణాల్లో 74 శాతం మంది 50 ఏళ్లు/ ఆపై బడినవారు ఉన్నారని ఐఎంఏ తెలిపింది. 35-50 ఏళ్లలో 19 శాతం మంది ఉన్నారని పేర్కొన్నది. 7 శాతం మంది మాత్రం 35 ఏళ్ల కన్నా తక్కువగా ఉన్నారని వెల్లడించింది. మొత్తం కరోనా వైరస్ సోకిన 1302 మంది వైద్యుల్లో 586 మంది ప్రైవేట్ కన్సల్టెంట్లు అని, 566 రెసిడెంట్ డాక్టర్లు, 150 హౌస్ సర్జన్లు అని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాజన్ శర్మ తెలిపారు.
ముంబైలో వెయ్యికి పైగా..
ముంబైలో వెయ్యికిపైగా ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వైరస్ సోకింది. వీరు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు అని తెలియజేసింది. కేఈఎం, సియాన్ ఆస్పత్రుల్లో 300 చొప్పున మందికి పాజిటివ్ వచ్చింది. ముంబైలో వైరస్ సోకి 9 మంది వైద్యులు చనిపోయారు. ప్రైవేట్ ప్రాక్టిషనర్స్ పీపీఈ కిట్లు ధరించడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఐఎంఏ మహారాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అవిశాన్ భోండె ఆరోపించారు.
కరోనా విజృంభణ..
మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కరోజుల్లో 32 వేల 695 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ సోకిన వారి సంఖ్య 9 లక్షల 68 వేలు దాటింది. గత 24 గంటల్లో 606 మంది కరోనా వైరస్ సోకిన వారు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 24 వేల 915 చేరింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.