‘రెండాకులు’ ఎవరికీ చెందవు: పన్నీరు, శశికళకు ఈసీ షాక్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఎన్నికల సంఘం భారీ షాకిచ్చింది. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి - అన్నాడీఎంకే పార్టీ గుర్తు ‘రెం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఎన్నికల సంఘం భారీ షాకిచ్చింది. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించి - అన్నాడీఎంకే పార్టీ గుర్తు 'రెండాకులు'ను ఏ వర్గానికీ కేటాయించకుండా స్తంభింపజేస్తూ ఎన్నికల సంఘం బుధవారం రాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది.
అంతకుముందు శశికళ వర్గం, పన్నీర్ సెల్వం వర్గం ఢిల్లీలో ఎన్నికల సంఘంతో దాదాపు ఆరు గంటల పాటు సమావేశమై వాదనలు వినిపించాయి. తమవైపు 122 మంది శాసనసభ్యులు, 37 మంది ఎంపీలున్నారని.. అధికారంలో కూడా ఉన్నామని.. గుర్తు తమకే చెందుతుందని శశికళ తరఫున ఎంపీ నవనీత కృష్ణన్ వివరించారు.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని, కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది కాబట్టి గుర్తును తమకే కేటాయించాలని పన్నీర్ సెల్వం తరఫున ఎంపీ మైత్రేయన్ కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయాన్ని వెల్లడించింది.
జయలలిత ఆకస్మిక మరణంతో ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ బరిలో శశికళ వర్గం అభ్యర్థి, పన్నీరుసెల్వం అభ్యర్థి, మరో వైపు దీపా జయకుమార్ ఉండటంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంటోంది. డీఎంకే, విజయకాంత్ పార్టీ తరపున కూడా అభ్యర్థులు బరిలో దిగుతున్నారు.