మాజీ ఎంఎల్ఏ ఫాంహౌస్లో బాలికపై గ్యాంగ్ రేప్
బెంగళూరు: బాలికను కిడ్నాప్ చేసి ఒక ఫాం హౌస్ లో నిర్బంధించి నాలుగు రోజుల పాటు ఆమె మీద సామూహిక అత్యాచారం చేసి నరకం చూపించిన సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా ఆలూరు సమీపంలో జరిగింది. ఒక కామాంధుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
ఆలూరు సమీపంలో మాజీ శాసన సభ్యుడు బి.డి. బసవరాజ్ ఫాం హౌస్ ఉంది. ఈ ఫాం హౌస్ లో లోకేష్ అలియాస్ బాబు మేనేజర్ గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 14 సంవత్రాల బాలిక మీద లోకేష్ కన్ను వేశాడు.
ఈ నెల 7వ తేదీన లోకేష్ తదితరులు బాలికను కిడ్నాప్ చేసి ఫాం హౌస్ లోని చీకటి గదిలో నిర్బంధించారు. బాలిక కనపడకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఆలూరు పోలీసులు బాలిక కోసం గాలించారు. అయినా ఫలితం దక్కలేదు.
నలుగురు కామాంధులు బాలిక మీద నాలుగు రోజుల పాటు నిరంతరం అత్యాచారం చేశారు. నాలుగు రోజుల తరువాత బాలికను తీసుకు వచ్చి ఆమె ఇంటి సమీపంలో వదిలి పెట్టి వెళ్లారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు బాలికకు వైద్య పరిక్షలు నిర్వహించి వివరాలు సేకరించి లోకేష్ ను అరెస్టు చేశారు. పరారైన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలిక మీద అత్యాచారం చేసే సమయంలో నిందితులు ముఖానికి ముసుగులు వేసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పరారైన నిందితులు ముగ్గురు అదే ఫాం హౌస్ లో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.