15 ఏళ్లకే పిల్లల్ని కనగలరు.. వివాహ వయసు పెంచడమెందుకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ మహిళల వివాహ వయసుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వయసుకే బాలికలు సంతాన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నప్పుడు మహిళల వివాహ వయసును పెంచాల్సిన అవసరమేంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 15 ఏళ్ల బాలిక కూడా సంతానాన్ని ఇవ్వగలదని వైద్యులే చెప్తున్నారు... అలాంటప్పుడు మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడంలో అర్థమేంటని ప్రశ్నించారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అందరికంటే పెద్ద డాక్టర్ అయిపోయారా అని ఎద్దేవా చేశారు.
సీఎం వ్యాఖ్యలకు కౌంటర్గా...
గత సోమవారం(జనవరి 11) 'నారి సమ్మాన్' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళల వివాహ వయసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాన్ని 18 ఏళ్ల 21 ఏళ్లకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలకు కౌంటర్గా సజ్జన్ సింగ్ ఇలా స్పందించారు.రాష్ట్రంలో మైనర్ బాలికలు అత్యాచారాలకు గురికాకుండా రక్షించడంలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని సజ్జన్ సింగ్ విమర్శించారు. మైనర్ బాలికలపై అత్యాచార కేసుల్లో మధ్యప్రదేశ్ దేశంలోనే టాప్లో ఉందన్నారు. ఇలాంటి దారుణాలను అరికట్టాల్సిన ముఖ్యమంత్రి దానికి బదులు హిపోక్రాట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధినేత్రి కూడా ఓ మహిళే... : బీజేపీ
సజ్జన్ సింగ్ వర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేత నేహా బగ్గా మాట్లాడుతూ... మహిళల వివాహ వయసుపై సజ్జన్ చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ఆడబిడ్డలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. 'వాళ్ల పార్టీ అధినేత కూడా ఒక మహిళే... ఆ విషయం సజ్జన్ మరిచిపోయారా... ప్రియాంక గాంధీ కూడా ఒక మహిళే కదా..?' అని పేర్కొన్నారు. సజ్జన్ తన వ్యాఖ్యలకు తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నేహా బగ్గా విజ్ఞప్తి చేశారు.
సమర్థిస్తున్న కాంగ్రెస్ నేతలు...
మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం సజ్జన్ సింగ్ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. సజ్జన్ ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో.. పక్కనే ఉన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా ఆయన్ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ అనవసరంగా దీన్నో రాద్దాంతం చేయాలని చూస్తోందన్నారు. మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలన్న సీఎం వ్యాఖ్యలకు ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అన్న కోణంలోనే సజ్జన్ ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. కాగా,మహిళల కనీస వివాహ వయసు సవరణపై కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటుందని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.