1946 లవ్ స్టోరీ: 72 ఏళ్ల తర్వాత కలిసిన ప్రేమికులు.. గుండెను పిండేసే ప్రేమకథా చిత్రం
సాధారణంగా మనకు ఇష్టమైన వారు కొన్ని రోజుల పాటు కనిపించకుండా లేదా దూరమైతే ఆ బాధను వర్ణించలేము. ఏదో కోల్పోయామనే భావన కలుగుతుంది. తిరిగి వస్తారు కానీ కొంచెం సమయం పడుతుందనే మాట కూడా జీర్ణించుకోలేము. అలాంటిది పెళ్లయిన 8 నెలలకే భర్త వేరై తిరిగి వస్తాడో లేదో... అసలు బతికే ఉన్నాడా... అనే అనుమానమే వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది. అవును ఇలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది. పెళ్లయిన 8 నెలలకే దేశంలో చోటుచేసుకున్న పరిణామాలతో విడిపోయిన భార్య భర్తలు తిరిగి 72 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. కాలం మారిందేమో కానీ వీరి ప్రేమ మాత్రం ఆ 72 ఏళ్ల తర్వాత కూడా సజీవంగానే బతికి ఉంది.
72 ఏళ్ల ఎడబాటు తర్వాత కలిసిన నంబియార్, శారద
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ వృద్ధుల పేర్లు ఈకే నారాయణన్ నంబియార్, శారద. నారాయణ్కు 90 ఏళ్ల వయస్సుండగా... శారదకు 85 ఏళ్లు. వీరి ప్రేమకథ అప్పుడెప్పుడో దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు కేరళలో ప్రారంభమైంది. అప్పుడు నారాయణన్ వయస్సు 18 ఏళ్లు శారద వయస్సు 13 ఏళ్లు. నాడు నారాయణన్ శారద వైపు చూస్తుంటే తను తెగ సిగ్గుపడిపోయేదని నారాయణన్ బంధువులు చెప్పారు. చూపులు కలిశాయి.. మనసులు కలిశాయి... ఇంకేముందు భాజా భజంత్రీలతో వేదమంత్రాల మధ్య ఇద్దరూ 1946లో ఒక్కటయ్యారు. కానీ ఇక్కడే విధి చిన్నచూపు చూసింది. దేశంలో చోటుచేసుకున్న రాజకీయపరిణామాల నేపథ్యంలో ఇద్దరూ వేరయ్యారు. నారాయణన్ మరో వివాహం చేసుకున్నాడు. అదే మాదిరిగా శారదా కూడా మరొకరికి భార్యగా స్థిరపడిపోయింది. ఇద్దరికి వారి వారి సొంత కుటుంబాలు ఉన్నాయి. అయితే నాడు ఇద్దరినీ వేరు చేసిన విధి నేడు మళ్లీ ఇద్దరినీ కలిపింది. బంధువుల కార్యక్రమంలో మళ్లీ శారద నారాయణ్ ఇద్దరూ కలిసి నాటి గుర్తులను నెమరేసుకున్నారు. ఇద్దరూ వేరయ్యారు కానీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మాత్రం దూరం కాలేదు.
రైతు వ్యతిరేక ఉద్యమంలో అరెస్టు అయిన నంబియార్
1946లో నారాయణన్ నంబియార్ శారదల ప్రేమకథ మొదలైంది. ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. పెళ్లి అయిన 8నెలలకే అంటే డిసెంబరు 1946లో కావుంబాయ్ రైతు ఉద్యమంలో నంబియార్ అతని తండ్రి పాల్గొన్నారు. తమ భూములపై దొరల పెత్తనంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తండ్రీ కొడుకులు పాల్గొన్నారు. 1946 డిసెంబర్ 30వ తేదీన మన కథలో హీరో నారాయణన్ నంబియార్ అతని తండ్రి తాలియన్ రామన్ నంబియార్ మరో 500 మంది కరకట్టిదాం నయనార్ దగ్గర ఉన్న కొండవైపు ఆయుధాలతో కవాతు చేశారు. ఓ ఇంటిపై దాడి చేసేందుకు ప్రణాళిక రచించారు. అయితే వీరు వేసిన ప్లాన్ నాటి బ్రిటీష్ అధీనంలో పనిచేసే మలబార్ స్పెషల్ పోలీసులకు తెలిసింది . అదే సమయానికి పోలీసులు కూడా అక్కడకు చేరుకుని నంబియార్ వర్గంపై కాల్పులు జరిపారు. నంబియార్ అతని తండ్రి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారిని పోలీసులు అరెస్టు చేసి కన్నూరు మరియు సేలం జైలుకు తరలించారు. ఇక నారాయణన్ ఎప్పటికీ తిరిగి రాడని భావించి శారదను ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకొచ్చి మరో వివాహం చేసేశారు. అయితే ఆ తర్వాత 8 ఏళ్లకు అంటే 1954లో నారాయణన్ జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా ఇంటికి వెళ్లగా తన భార్య శారదకు మరో వివాహం చేశారని తెలుసుకుని షాక్కు గురయ్యాడు. నారాయణన్ కూడా మరో వివాహం చేసుకుని ఏడుగురి పిల్లలకు తండ్రి అయ్యాడు.
72 ఏళ్ల తర్వాత కలిసి కన్నీటి పర్యంతమైన శారద, నంబియార్
నారాయణన్ నంబియార్ శారదల ప్రేమ గురించి తెలుసుకున్న నారాయణన్ మేనకోడలు శాంత కవుంబాయి "30 డిసెంబరు "అనే పుస్తకం రాశారు. శారద కుమారుడు భార్గవన్ శాంతను కలుసుకుని ఇద్దరు కలిసేలా ఏర్పాటు చేయాలని భావించారు. ఇద్దరి కుటుంబాలతో మాట్లాడి కన్నూరులోని భార్గవన్ ఇంట్లో శారద, నంబియార్ కలిసే ఏర్పాటు చేశారు. అక్కడికి నంబియార్ అతని వదిన పిల్లలతో కలిసి వచ్చాడు. ఇక శారదను చూసిన నంబియార్ కంట నీరు ఆగలేదు. ఆనాటి స్వచ్ఛమైన ప్రేమ అతని కళ్లలో కనిపించింది. శారదను తలపై ప్రేమతో నిమిరారు. శారద కళ్లలోనుంచి కూడా కన్నీరు ఏరులై పారింది. అందరికి తమ ప్రేమ గురించి చెప్పారు. నాటి జ్ఞాపకాలు, వారు వేరపడేందుకు దారితీసిన పరిస్థితులు చెప్పి చాలా బాధపడ్డారు. నంబియార్ను పెళ్లి చేసుకుని మెట్టినింటికి వెళ్లినప్పుడు ఆ కుటుంబం సొంత కూతురిలా తనను ఆదరించారని శారద చెప్పింది. ఇక చివరిగా నంబియార్ వెళ్లే సమయం ఆసన్నమైంది. తను వెళుతున్నాను అని శారదా తలపై చేయి ఉంచి చెప్పాడు. శారద ఇందుకు తల వంచి సరే అని చెప్పడం చూస్తే ఆ సన్నివేశం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించి వేస్తుంది.