ముస్లీం యువతి లవ్ మ్యారేజ్: గోవాలో కాపురం, గర్బిణి, నడిరోడ్డులో నవవధువు సజీవదహనం !
వేరే మతం వ్యక్తిని వివాహం చేసుకోందని సహించలేని అమ్మాయి కుటుంబ సభ్యులు గర్బిణి అనే కనికరం లేకుండా నడిరోడ్డులో సజీవదహనం చేసిన ఘటన కర్ణాటకలోని బీజాపుర జిల్లాలో జరిగింది.
బెంగళూరు: వేరే మతం వ్యక్తిని వివాహం చేసుకోందని సహించలేని అమ్మాయి కుటుంబ సభ్యులు గర్బిణి అనే కనికరం లేకుండా నడిరోడ్డులో సజీవదహనం చేసిన ఘటన కర్ణాటకలోని బీజాపుర జిల్లాలో జరిగింది. గుండకనహళ్లికి చెందిన భాను బేగం (21) అనే నవ వధువును ఆమె కుటుంబ సభ్యులే సజీవదహం చేశారు.
భాను బేగం కుటుంబ సభ్యులు దాడి చెయ్యడంతో ఆమె భర్త శరణప్ప (24) తీవ్రగాయాలై బీజాపుర జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డీఎస్పీ పీపీకే. పాటిల్ చెప్పారు. భాను బేగంను హత్య చేసిన ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మతం వేరే అయినా ప్రేమ !
గుండకనహళ్లికి చెందిన శరణప్ప, భాను బేగం ఇద్దరూ ప్రేమించుకున్నారు. శరణప్ప దళితుడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. తాము పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ వారి కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి చెయ్యడానికి నిరాకరించారు.
మైనర్ అంటూ కేసు పెట్టారు
భాను బేగం కుటుంబ సభ్యులు శరణప్పను చితకబాదేశారు. అంతే కాకుండా భాను బేగం మైనర్, ఆమెను వలలో వేసుకున్నాడని శరణప్ప మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మీద దాడి చేశారని శరణప్ప సైతం భాను బేగం కుటుంబ సభ్యుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పంచాయితీ చేశారు
భాను బేగం కుటుంబ సభ్యులు ఒత్తిడి చెయ్యడంతో పెద్దలు పంచాయితీ చేశారు. 2017 జనవరి 23వ తేదీన జరిగిన పెద్దల పంచాయితీలో తాము విడిపోవడానికి అంగీకరించమని భాను బేగం, శరణప్ప తేల్చి చెప్పారు. అదే సందర్బంలో శరణప్ప మీద మళ్లీ దాడి చేశారు.
గోవాకు పరార్, రిజిస్టర్ మ్యారేజ్ !
గొడవ జరిగిన మరుసటి రోజు (జనవరి 24వ తేదీ) భాను బేగం, శరణప్ప ఊరు వదిలి గోవాకు పారిపోయారు. తరువాత అక్కడే రిజిస్టర్ మ్మారేజ్ చేసుకుని ఓ ఇంటిలో కాపురం పెట్టారు. భాను బేగం ప్రస్తుతం నాలుగు నెలల గర్బవతి. ఇద్దరూ అక్కడే సంతోషంగా కాలం గడిపారు.
గర్బవతి అని తెలిస్తే ఆదరిస్తారని !
భాను బేగం గర్బవతి అని తెలిస్తే ఆమె కుటుంబ సభ్యులు ఆదరిస్తారని వీరు పోరపాటుపడ్డారు. ఇంటికి వెళ్లాలని శనివారం సొంత ఊరు వచ్చారు. అయితే భాను బేగం కుటుంబ సభ్యులు మాత్రం వెంటనే ఇద్దరూ విడిపోవాలని హెచ్చరించారు.
రోజంతా పంచాయితీ, గొడవ
పెద్దలు రోజంతా పంచాయితీ చేశారు. వెంటనే భాను బేగంకు తలాక్ చెప్పాలని ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. అందుకు శరణప్ప, భాను బేగం అంగీకరించలేదు. శరణప్పను రక్తం కారే వరకు చితకబాదేశారు. దెబ్బలు తట్టుకోలేని శరణప్ప అర్దరాత్రి పోలీస్ స్టేషన్ కు పరుగు తీశాడు.
నడిరోడ్డులో కాల్చేశారు !
శరణప్ప పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తరువాత అర్దరాత్రి అక్కడే ఉన్న భాను బేగం కుటుంబ సభ్యులు సహనం కొల్పోయారు. కిరోసిన్, పెట్రోల్ తీసుకుని నడిరోడ్డులో భాను బేగం మీద పోసి నిప్పంటించారు. కేవలం 10 నిమిషాల్లో శరణప్ప పోలీసులను పిలుచుకుని అక్కడికి చేరుకున్నాడు.
నడిరోడ్డులో సజీవదహనం
భాను బేగంకు నిప్పంటించడంతో నడిరోడ్డులో ఆమె సజీవదహనం అయ్యింది. గర్బిణి అనే కనికరం లేకుండా ఎవ్వరూ మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించకపోవడంతో ఆమె అక్కడే ప్రాణాలు వదిలింది. తన కళ్ల ముందే భార్య సజీవదహనం కావడంతో శరణప్ప కుప్పకూలిపోయాడు.
దర్జాగా వెళ్లిపోయారు
భాను బేగంకు నిప్పంటించి హత్య చేసిన ఆమె కుటుంబ సభ్యులు దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భాను బేగం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి ఆమె భర్త శరణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ పీపీకే. పాటిల్ తెలిపారు.