ఢిల్లీలో గన్ కల్చర్: లేడీ గ్యాంగ్స్టర్ వీరంగం: బూతులు తిడుతూ: అరెస్టుకు అయిదు రోజులు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రాత్రివేళ వీరంగం సృష్టించిన ఓ మహిళను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆమెను లోకల్ గ్యాంగ్స్టర్ చెల్లెలిగా గుర్తించారు. ఓ కిరాణా దుకాణం వద్ద రాత్రిపూట కాల్పులు జరుపుతూ, అడ్డుకోబోయిన స్థానికులను బూతులు తిడుతూ కనిపించారామె. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కిందటి వారం ఈ ఘటన చోటు చేసుకోగా.. సోమవారం రాత్రి ఆమెను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బురఖా ధరించి ఉండటం వల్ల త్వరగా గుర్తించలేకపోయామని వివరణ ఇచ్చారు.
ఈ నెల 18వ తేదీన రాత్రి వేళ ఈశాన్య ఢిల్లీలోని చౌహాన్ బంగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జఫ్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది ఈ ప్రాంతం. లేన్ నంబర్ 4లో ఉన్న ఫహీమ్ కిరాణా దుకాణంపై ఆమె కాల్పులు జరిపారు. షట్టర్లు వేసిన తరువాత అక్కడికి చేరుకున్న ఆమె.. తనకు దినసరి వస్తువులు కావాలని, వెంటనే దుకాణాన్ని తెరవాలని యజమానికి ఫోన్ చేశారు. అతను నిరాకరించడంతో బూతులు తిట్టారు. వీరంగం సృష్టించారు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో దుకాణం షట్టర్లపై నాలుగు సార్లు కాల్పులు జరిపారు.
ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులనూ వదల్లేదు. రాయడానికి వీల్లేని భాషతో వారినీ బండ బూతులు తిట్టారు. అనంతరం తన కోసం వేచివున్న వ్యక్తితో కలిసి స్కూటర్పై పారిపోయారు. స్థానికులు కొందరు ఆమె వీరంగాన్ని సెల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది. దుకాణం యజమాని ఫహీమ్ ఫిర్యాదు మేరకు జఫ్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతనికి వచ్చిన ఫోన్ కాల్ నంబర్, సోషల్ మీడియా వీడియో ద్వారా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి ఆమెను అరెస్టు చేశారు.
Recommended Video
లోకల్ గ్యాంగ్స్టర్ నజీర్ సోదరిగా నుస్రత్గా గుర్తించామని ఈశాన్య ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వేద్ ప్రకాష్ సూర్య తెలిపారు. బాకీని చెల్లించకపోవడం వల్ల ఫహీమ్ దుకాణంపై నుస్రత్ కాల్పులు జరిపినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. లోనీ ప్రాంతానికి చెందిన మక్సూద్ అనే వ్యక్తి దగ్గరి నుంచి తాను పిస్టల్ను తీసుకున్నట్లు ఆమె వెల్లడించారని అన్నారు. పలు సెక్షన్ల కింద నుస్రత్పై కేసు నమోదు చేశామని వెల్లడించారు.