ముస్లిం ఫ్యామిలీలో గణేశ్ ఫెస్టివల్... మత సామరస్యాన్ని నిలబెట్టిన మూడేళ్ల చిన్నారి...
పిల్లలు దైవ సమానులని చాలామంది హిందువుల నమ్మకం. పిల్లలు దైవం ఇచ్చిన కానుకలని ముస్లింల విశ్వాసం. మతమేదైనా పిల్లల పట్ల దాదాపుగా అందరి భావన ఒక్కటే. వారు కల్మషం లేనివారు, ప్రపంచంతో ఏ పేచీ లేనివారు. దేవుడంటే ఏమిటో తెలియకపోయినా తల్లిదండ్రులు చెప్తే ముద్దుగా చేతులెత్తి మొక్కేవారు. అయితే మన దేవుడు,పరాయి దేవుడు అన్న భావాలు పెద్దలకే తప్పితే పిల్లలకు వాటితో పనిలేదు. కుల,మతాల చట్రంలో ఇరుక్కుపోయే మనస్తత్వం ఇంకా నాటుకుపోని మెదళ్లు కాబట్టి... ఏ దేవుడి పట్లనైనా వారు ఒకేలా స్పందించగలరు. అందుకు ముంబైలోని ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.
గణేశ్ ప్రతిమ కోసం చిన్నారి మారాం...
మహారాష్ట్రలోని ఒస్మానాబాద్ జిల్లా కలంబ్ మండల డిప్యూటీ తహశీల్దార్ అస్లమ్ జమాదార్... గత శనివారం గణేశ్ చతుర్ధి రోజున తన కార్యాలయంలో ఉన్న సమయంలో భార్య నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. వారి మూడేళ్ల కుమారుడు అబ్రర్ గణేశ్ ప్రతిమ కావాలని మారాం చేస్తున్నాడని చెప్పింది. అస్లం ముస్లిం కావడంతో ఆ మాటలకు ఏం బదులివ్వాలో అతనికి వెంటనే ఏమీ తోచలేదు. ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పమని భార్యకు చెప్పి ఫోన్ పెట్టేశాడు.
భర్తకు వాట్సాప్లో ఫోటో...
ఓ గంట తర్వాత భార్య నుంచి వాట్సాప్కు ఓ ఫోటో వచ్చింది. ఏంటా అని చూస్తే... తమ ఇంట్లో గణేశ్ ప్రతిమను పెట్టి అందంగా అలంకరించారు. భార్యకు ఫోన్ చేస్తే అసలు విషయం చెప్పింది. అబ్రర్ పొరుగింటికి వెళ్లి... వాళ్లను అడిగి ఆ ప్రతిమను తీసుకొచ్చాడని చెప్పింది. తన కొడుకు కోరికకు అస్లమ్ కూడా పెద్దగా అభ్యంతరపడలేదు. అయితే అదే ఫోటోను తన సహచర ఉద్యోగులకు చూపించగా వారంతా నవ్వారు. ముస్లిం అయి ఉండి హిందూ దేవుడిని పూజించడమేంటన్న అర్థం ఆ నవ్వుల్లో స్పురించింది. దీంతో అస్లమ్ కాస్త నొచ్చుకున్నాడు.
మొదట ఆందోళన చెందినా...
అబ్రర్ ఇంట్లో గణేశ్ ప్రతిమను పెట్టాడని తెలిస్తే తన తల్లిదండ్రులు,బంధువులు ఏమనుకుంటారోనని కాస్త ఆందోళన చెందాడు. అయితే సాయంత్రం ఇంటికి వెళ్లాక అస్లమ్ ఆలోచనలు,ఆందోళన కొట్టుకుపోయాయి. తన కొడుకు సంతోషం చూసి అతనూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తన కొడుకు ఇంతలా పట్టరాని సంతోషంతో ఉండటం ఎప్పుడూ చూడలేదని... ఆ సంతోషానికి తన ఆలోచలన్నీ ఎగిరిపోయాయని చెప్పాడు.
పూజల కంటే ప్రేమ,విశ్వాసంతో...
ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పగా... వారేమీ అభ్యంతరం చెప్పలేదని,అయితే కాస్త ఆందోళన వ్యక్తం చేశారని అస్లమ్ తెలిపారు. 'ముస్లింలుగా ఒక హిందూ దేవుడిని ఎలా పూజించాలో,ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో మనకు తెలియదు కదా.. హిందువుల్లా మనం సరైన రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించలేమోమో. కాబట్టి గణేశుడిని త్వరగా నిమజ్జనం చేయండి.' అని అస్లమ్ తల్లిదండ్రులు సూచించారు. అయితే పూజలు,ఇతరత్రా కంటే ఇది పూర్తిగా ప్రేమ,నమ్మకంతో కూడుకున్న వ్యవహారమని... ఆ విషయంలో మా నుంచి ఏ లోటు లేనందునా... పూర్తిగా 10 రోజుల పాటు గణేశుడిని ఇంట్లోనే ఎందుకు ఉంచుకోకూడదని ఆలోచిస్తున్నామన్నారు అస్లమ్.
వచ్చే ఏడాది కూడా...
యూట్యూబ్లో చూసి గణపతికి నైవేద్యం కూడా వండినట్లు అస్లమ్ భార్య అర్షియా తెలిపారు. వృత్తిపరంగా డాక్టర్ అయిన ఆమె.. గణపతికి ప్రతీరోజూ హారతి ఇస్తున్నట్లు తెలిపారు. గణేశ్ ప్రతిమను పెట్టాక తన కొడుకు చాలా సంతోషంగా ఉంటున్నాడని... గణపతిని కూడా తనతో పాటే బెడ్ పైకి తీసుకెళ్తానంటున్నాడని అస్లమ్ నవ్వుతూ చెప్పాడు. ఒకరకంగా తమ కొడుకు ఒక కొత్త సంప్రాదాయానికి తెరలేపాడని... వచ్చే ఏడాది కూడా తాము గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు. ఇదో కొత్త మార్పుకు నాంది పలుకుతుందని అన్నారు.