చేతబడి కోసం బ్లాక్ కైట్ గోళ్లు, ముక్కు కోసేశారు
బెంగళూరు: బెంగళూరు నగరంలో అపురూపమైన పక్షిని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అటవీ శాఖ అధికారులు రక్షించారు. బ్లాక్ కైట్ అనే పక్షిని రక్షించారు. మారతహళ్ళి సమీపంలోని కుందనహళ్ళి గేట్ దగ్గర ఉన్న హైపర్ సిటి సూపర్ మార్కెట్ ఆవరణలో బ్లాక్ కైట్ ను రక్షించామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
ఈ బ్లాక్ కైట్ గోర్లు, ముక్కు, కాలి వేళ్లు, తోక కత్తిరించేశారు. ఈ గోర్లు, ముక్కుతో పాటు, ఈ పక్షిని చేతబడి చేసే దానికి ఉపయోగిస్తారని అటవీ శాఖ అధికారులు అన్నారు. హైపర్ సిటి సూపర్ మార్కెట్ ఆవరణలో ఎగరలేని పరిస్థితిలో ఉన్న బ్లాక్ కైట్ మీద అనేక పక్షులు, కాకులు దాడి చేశాయి.
విషయం గుర్తించిన హైపర్ సిటి సూపర్ మార్కెట్ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బీబీఎంపీ అటవి శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బ్లాక్ కైట్ ను రక్షించారు. తరువాత అక్కడే బ్లాక్ కైట్ కు ప్రథమ చికిత్స చేశారు.
తరువాత బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనంలోకి బ్లాక్ కైట్ ను తరలించారు. బ్లాక్ కైట్ గోళ్లు,ముక్కు కత్తిరించారని, ఈ పక్షి ఎగరకుండా తోక కత్తిరించారని అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఈ పక్షిని చేతబడి చెయ్యడానికి ఉపయోగిస్తారని అటవి శాఖ అధికారులు దృవీకరించారు.
2010వ సంవత్సరంలో బెంగళూరులోని బాణసవాడి సమీపంలోని హెణ్ణూరులోని కళ్యాణ నగర మురికివాడలలో 10 బ్లాక్ కైట్ లను పెట్టి చేతబడి చేస్తున్న తమిళ స్వామి అనే వ్యక్తిని అరెస్టు చేశామని అటవి శాఖ అధికారులు చెప్పారు. అప్పటికే 10 పక్షులకు గోర్లు, ముక్కు, తోకలు కత్తిరించారని అన్నారు.
ఈ పక్షులను చేతబడి చెయ్యడానికి ఉపయోగిస్తారని తమిళ స్వామి చెప్పాడని, అతనిని జైలుకు పంపించామని అటవీ శాఖ అధికారులు అన్నారు. కుందనహళ్ళి పరిసర ప్రాంతంలోనే ఈ బ్లాక్ కైట్ గోళ్లు, ముక్కు కత్తిరించి ఉంటారని అధికారులు చెప్పారు. ఈ బ్లాక్ కైట్ కు కీచు గొంతు, నల్లటి కళ్లు ఉంటాయని అటవీ శాఖ అధికారులు వివరించారు.