తల్లిని కాపాడుకునేందుకు చిరుతతో పోరాడిన యువతి: రక్తం కారుతున్నా..
ముంబై: తన తల్లి ప్రాణాలను కాపాడుకునేందుకు తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా.. ఏకంగా చిరుతపులితోనే పోరాడింది ఓ యువతి. తీవ్రగాయాలతో రక్తం కారుతున్నా.. చిరుతతో పోరాడి తన తల్లిని కాపాడుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని సకోలిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సకోలీ తాలుకా పరిధిలోని ఉస్గావ్లో మార్చి 24 రాత్రి 10 గంటల సమయంలో మేకలను కట్టేసిన ప్రాంతం నుంచి శబ్ధం రావడంతో జీజాబాయి, ఆమె కుమార్తె రూపాలీ (21) ఇంట్లో నుంచి బయటకి వచ్చారు. అప్పటికే రక్తపుమడుగులో పడివున్న మేక పిల్లల్ని చిరుత తింటోంది.
తల్లీకూతుర్లను చూసిన చిరుత వారిపై దాడికి తెగబడింది. భయపడకుండా రూపాలీ కర్రతో చిరుతపై ఎదురు దాడికి దిగింది. 15 నిమిషాల పాటు పోరాడింది. ఓవైపు చిరుతపై దాడిచేస్తూ, మరోవైపు తన తల్లిని ఓ చెత్తో వెనక్కి నెడుతూ ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకున్నారు.
ఆ తర్వాత కాసేపటికి చిరుత అక్కడ్నుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రూపాలీని నాగ్పూర్లోని ప్రభుత్వ వైద్యవిద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొంది కోలుకున్న రూపాలీని మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. తల్లి ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిని రూపాలిని స్థానికులు అభినందనలతో ముంచెత్తారు.