కలకలం: తొలి రాత్రి పడకగది నుంచి బయటకు, వరుడు అదృశ్యం
వివాహమైన తొలి రాత్రి పడక గదికి వెళ్లిన నవ వరుడు బయటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాలేదు. దీంతో ఆ కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు.
తిరునెల్వేలి: వివాహమైన తొలి రాత్రి పడక గదికి వెళ్లిన నవ వరుడు బయటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాలేదు. దీంతో ఆ కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. అంథోని జోసెఫ్ (29) తిరునెల్వేలి జిల్లా విక్రమసింగపురం సెట్టిమేడు మెయిన్ రోడ్డు పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇతను సెంట్రింగు పనిచేస్తున్నాడు. కాగా, ఇతనికి సెట్టిమేడు సమీపంలోని ఒక ఆదరణ లేని యువతితో వివాహం నిశ్చయించారు జోసెఫ్ తల్లిదండ్రులు.
ఆ యువతి నర్సింగ్ పూర్తిచేసి ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరి వివాహం జులై3వ తేదీన జరిగింది. రాత్రి రిసెప్షన్ తర్వాత మొదటి రాత్రికి బంధువులు ఏర్పాట్లు చేశారు. పడక గదిలోకి వెళ్లిన జోసెఫ్ భార్యతో కడుపులో నొప్పిగా ఉందని బయటకు వచ్చాడని, తర్వాత ఎంతసేటికీ తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమెతో పాటు బంధువులు అనేక ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడవంతో జోసెఫ్ తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించలేదని ఫిర్యాదు చేసినట్లు విక్రమ సింగపురం పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జోసెఫ్ కోసం గాలిస్తున్నామని తెలిపారు.