ఎంత కష్టం వచ్చిందో: బస్సులోనే ఆత్మహత్య చేసుకున్న ఆర్ టీసీ కండెక్టర్!
జీవితంపై విరక్తి చెందిన ఆర్టీసీ కండెక్టర్ అతను విధులు నిర్వహిస్తున్న బస్సులోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని హుబ్బళి నగరంలో జరిగింది.
బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన కండెక్టర్ అతను విధులు నిర్వహిస్తున్న బస్సులోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని హుబ్బళి నగరంలో జరిగింది. హుబ్బళికి చెందిన అబ్బాస్ ఆలీ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.
హుబ్బళిలోని బసవకళ్యాణ డిపోలో అబ్బాస్ ఆలీ కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం విధులకు హాజరైనాడు. రాత్రి విధులు పూర్తి అయిన తరువాత (నైట్ డ్యూటీ) డ్రైవర్ బస్సు తీసుకెళ్లి హుబ్బళి కొత్త బస్ స్టాండ్ లో పార్క్ చేశాడు, తరువాత డ్రైవర్ అదే బస్సులో నిద్రపోయాడు.
అదే బస్సులో కండెక్టర్ అబ్బాస్ ఆలీ నిద్రపోయినట్లు నటించాడు. అయితే డ్రైవర్ నిద్రపోయిన విషయం గుర్తించిన అబ్బాస్ ఆలీ అదే బస్సులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం నిద్రలేచిన డ్రైవర్ విషయం గుర్తించి కేఎస్ఆర్ టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
బసవకళ్యాణ డిపో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అబ్బాస్ ఆలీ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, అతని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, కేసు విచారణలో ఉందని గోకుల పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.