పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై మనదేశంలో కేసు నమోదు
పాట్నా: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం మాట్లాడుతూ భారతదేశంపై విషం కక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో కేసు నమోదైంది. సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది చీఫ్ జుడీషియల్ న్యాయస్థానంలో ఇమ్రాన్ ఖాన్పై ఫిర్యాదు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదం, భారత్ 'కాశ్మీర్'పై అక్కసు: ఆర్ఎస్ఎస్, మోడీపై తీవ్ర వ్యాఖ్యలు
ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో శుక్రవారం రాత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారతదేశంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక, అణుయుద్ధమంటూ బెదిరింపులకు దిగారని తెలిపారు.
తన ఫిర్యాదు ఆధారంగా న్యాయస్థానం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఇమ్రాన్ ఖాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు సుధీర్ కుమార్ ఓజా. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశంలోని ఓ వర్గాన్ని ప్రేరేపిస్తూ అసమ్మతిని సృష్టించేలా ఉన్నాయని సుధీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడుతూ మనదేశంపై ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికే తాను ఇక్కడికి వచ్చానని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. కాశ్మీర్లో యువకులు ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణమంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు.
తాము ఎందుకు కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపుతామని, తమకు ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు. తమను ఉగ్రదేశంగా భారత్ చిత్రీకరిస్తోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అణ్వాయుధ దేశం యుద్ధానికి దిగితే దాని ఫలితం సరిహద్దులు దాటి ఉంటుందని, ఈ సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచాన్ని హెచ్చరించారు ఇమ్రాన్ ఖాన్. ఇది తాను బెదిరించడానికి చెప్పడం లేదని.. ఐక్యరాజ్యసమితి కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకు చెబుతున్నానని యుద్ధోన్మాదాన్ని వ్యక్తం చేశారు.
పాకిస్థాన్కు గుణపాఠం చెబుతామంటూ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారంటూ చెప్పుకొచ్చారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ముస్లింలు యువకులను ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విషం కక్కారు ఇమ్రాన్ ఖాన్. జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. తన వ్యాఖ్యల ద్వారా ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి తన దొంగబుద్ధిని చాటుకున్నారు ఇమ్రాన్ ఖాన్.