పాఠశాలను తగులబెట్టిన విద్యార్థులు: విలువైన రికార్డులు బుగ్గి!
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలను తగులబెట్టేశారు. దీనికి కారణం.. పాఠశాల సిబ్బంది వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవడమే. క్రమశిక్షణాచర్యల్లో భాగంగా.. ప్రిన్సిపల్ ఆరుమంది విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. దీన్ని అవమానకరంగా భావించిన ఆ విద్యార్థులు పెట్రోల్ పోసి మరీ పాఠశాల భవనాన్ని తగులబెట్టారు. ఈ ఘటనలో 10కి పైగా తరగతులు మంటల బారిన పడ్డాయి. విద్యార్థులకు సంబంధించిన విలువైన రికార్డులు, ధృవీకరణ పత్రాలు బూడిదయ్యాయి.
మణిపూర్ లోని కాక్ఛింగ్ జిల్లాలోని సుగ్నులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సెయింట్ జోసెఫ్ ప్రాథమికోన్నత పాఠశాలకు మంచి గుర్తింపు ఉంది. మణిపూర్ లోకెల్లా అత్యంత ప్రాచీనమైన క్యాథలిక్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ గా పేరుంది. కొద్దిరోజుల కిందట పాఠశాల అధికారులు ఆరుమంది విద్యార్థులను తరగతుల నుంచి సస్పెండ్ చేశారు. స్కూలు నిబంధనలను ఉల్లంఘించినందున వారిపై క్రమశిక్షణా చర్యలను తీసుకున్నారు. ఇందులో భాగంగా- కొన్ని రోజుల పాటు వారిని సస్పెండ్ చేశారు. విద్యార్థులు అవమానకరంగా భావించారు. పగతో రగిలిపోయారు. ఈ నెల 25వ తేదీన రాత్రి.. పెట్రోల్ డబ్బాలను తీసుకెళ్లి, పాఠశాల భవనాన్ని తగుల బెట్టారు. మంటలను సకాలంలో అదుపు చేయలేకపోవడంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది. మొత్తం 10కి పైగా తరగతి గదులు, పరిపాలనా గది మంటల బారిన పడ్డాయి. పరిపాలన గదిలో ఉంచిన విలువైన రికార్డులు కాలిపోయి బూడిదగా మారాయి.
ఈ ఘటనపై మణిపూర్ విద్యాశాఖ మంత్రి లోట్పావో హావోకిప్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీన్ని అతివాద విద్యార్థుల చర్యగా అభివర్ణించారు. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మిగిలిన విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ పాఠశాలలకు వారిని తరలిస్తామని చెప్పారు. మంటల బారిన పడి మొత్తం 10కి పైగా తరగతి గదులు ధ్వంసం అయ్యాయయని సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్ డొమినిక్ తెలిపారు.