హిందువులు, గోవుల మీద నటుడు ప్రకాష్ రాజ్ కామెంట్, కేసు నమోదు, కోర్టులో !
బెంగళూరు: బహుబాష నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రకాష్ రాజ్ మీద బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. గోవులు, హిందువులను కించపరిచే విధంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని, సమాజంలో గొడవలు జరగడానికి కారణం అవుతున్నారని కేసు నమోదు చేశారు.
బెంగళూరు నగరంలోని హనుమంతనగర పోలీస్ స్టేషన్ లో ప్రకాష్ రాజ్ మీద న్యాయవాది ఎన్. కిరణ్ ఫిర్యాదు చేశారు. బెంగళూరు నగరంలోని 24వ ఏసీఎంఎం న్యాయస్థానంలో ప్రకాష్ రాజ్ కు విరుద్దంగా అర్జీ సమర్పించారు.
గోవులు, హిందువులను కించపరిచే విధంగా మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ మీద చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఎన్. కిరణ్ కోర్టులో మనవి చేశారు. న్యాయవాది కిరణ్ వాదనలు విన్న న్యాయస్థానం విచారణకు అర్జీ స్వీకరించింది.
విజయపురలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ గోవులను కించపరిచే విధంగా మాట్లాడారు. అంతే కాకుండా కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో పర్యటించిన ప్రకాష్ రాజ్ హిందువులను కించపరిచి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ను ఇలాగే విదిలేస్తే ఆయన సమాజంలో అల్లర్లు జరగడానికి కారణం అవుతారని న్యాయవాది కిరణ్ ఆరోపిస్తున్నారు.