కన్నడ, మరాఠీ చిచ్చు: మహారాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేతో సహ 13 మంది మీద కేసులు, ఎఫ్ఐఆర్ !
సరిహద్దులో కన్నడ, మరాఠీ చిచ్చు, మహామేళ.కళ్లు కప్పి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కర్ణాటకకు వ్యతిరేకంగా నినాదాలు,కేసు నమోదు చేసిన పోలీసులు, ఎంఈఎస్ నాయకుల అరెస్టుకు రంగం సిద్దం
బెంగళూరు: కర్ణాటక నుంచి బెళగావి జిల్లాతో సహ కొన్ని ప్రాంతాలను విభజించి మహారాష్ట్రలో కలిపి వెయ్యాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) ఏర్పాటు చేసిన మహామేళ కార్యక్రమంలో కన్నడిగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, నిషేధాజ్ఞలు ఉన్నా వాటిని ఉల్లంఘించి అక్రమంగా చొరబడ్డారని బెళగావి పోలీసులు కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని కోల్లాపురకు చెందిన ఎంఈఎస్ పార్టీ ఎంపీ ధనంజయ మహాడిక్, ఎమ్మెల్యే సంధ్యా కుప్పేకర్, జయంత్ రావ్ పాటిల్ తో సహ 13 మంది మీద బెళగావి పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి వారిని అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు.
సోమవారం నుంచి బెళగావిలోని సువర్ణ విదాన సౌధలో కర్ణాటక శాసన సభ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. శాసన సభ సమావేశాలు ఇక్కడ నిర్వహించరాదని, బెళగావిని మహారాష్ట్రలో కలిపేయాలని డిమాండ్ చేస్తూ బెళగావిలో ఎంఈఎస్ నాయకులు సోమవారం మహామేళ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రకు చెందిన ఎంఈఎస్ పార్టీ నాయకులను మహామేళకు ఆహ్వానించారు. మహారాష్ట్ర నాయకులు బెళగావిలో ప్రవేశించరాదని జిల్లాధికారులు, పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎంఈఎస్ నాయకులను అడ్డుకుని వెనక్కి పంపించారు.
మహారాష్ట్ర ఎంపీ ధనంజయ్, ఎమ్మెల్యే సంధ్యా తదితరులు పోలీసుల కళ్లు కప్పి బెళగావిలో ప్రవేశించారు. మహామేళ కార్యక్రమంలో పాల్గొని కర్ణాటకకు వ్యతిరేకంగా ప్రసంగాలు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు.