కోర్టులో హాజరు: అటు నుంచి అటే హత్య కేసు నిందితుడి పరార్
బెంగళూరు: హత్య కేసులో అరెస్టయిన నిందితుడు నేరం రుజువు అయ్యిందని వెలుగు చూడటంతో కోర్టు ఆవరణం నుండి క్షణాలలో తప్పించుకుని పరారైనాడు. కంగుతిన్న పోలీసులు అతని కోసం మంగళూరు నగరం మొత్తం గాలించినా ఫలితం లేకపోయింది.
మంగళూరులోని రెండవ జిల్లా కోర్టు ఆవరణం నుండి హత్య కేసులో నిందితుడు అక్షయ్ తప్పించుకుని పరారైనాడు. 2011 జూన్ 15వ తేదిన ముల్లాకాడ్ ప్రాంతంలో కుమార్ అనే వ్యక్తి హత్యకు గురైనాడు. ఈ కేసులో పోలీసులు అక్షయ్ తోపాటు సంతోష్, గౌరీష్, హర్ష రాజ్, గౌతమ్ లను అరెస్టు చేశారు.
అప్పటి నుండి వీరు జైలులో ఉన్నారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. బుధవారం కోర్టులో కేసు విచారణ ఉండటంతో మంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న ఈ ఐదుగురిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
ఈ ఐదుగురు కలిసి కుమార్ ను హత్య చేశారని న్యాయస్థానం నిర్దారించింది. సాయంత్రం ఐదుగురిని కోర్టు ఆవరణం నుండి తీసుకుని బయటకు వచ్చారు. తరువాత జైలు దగ్గరకు వెళుతున్న సమయంలో అక్షయ్ తాను బాత్ రూంకు వెళ్లాలని చెప్పాడు. తరువాత పోలీసుల కళ్లు గప్పి మాయం అయ్యాడు. పోలీసులు అక్షయ్ కోసం గాలిస్తున్నారు.