సహజీవనం, వరదల్లో కుమారుడు చనిపోయాడు, రూ. 5 లక్షల పరిహారం కోసం నాటకం!
మడికేరి(కర్ణాటక): ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు పరిహారం వస్తుందని దురాశతో కుమారుడు మట్టి దిబ్బల కింద పడి మరణించాడని అధికారులను నమ్మించి మోసం చేసిన తల్లి, ఆమె ప్రియుడు చివరికి పోలీసులకు చిక్కిపోయారు. కర్ణాకలోని కొడుగు జిల్లా మడికేరి సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
సోమశేఖర్, సుమా కలిసి సహజీవనం చేస్తున్నారు. సుమాకు ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడిని సుమా తన పుట్టింటిలో వదిలిపెట్టింది. సోమశేఖర్ భార్య, పిల్లలను వదిలిపెట్టి సుమాతో కలిసి మడికేరి సమీపంలోని కాలూరు గ్రామంలోని కాఫీ తోట సమీపంలోని లైన్ లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.
సోమశేఖర్, సుమా సహజీవనం చేస్తూ కాఫీ తోటలో పని చేస్తున్నారు. ఇటీవల కురుసిన భారీ వర్షాల కారణంగా సోమశేఖర్, సుమా నివాసం ఉంటున్న ఇల్లు కుప్పకూలిపోయింది. సోమశేఖర్, సుమా మడికేరిలోని మైత్రి హాల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం చేరుకున్నారు.
పునరావాస కేంద్రంలో ఉంటున్న సోమశేఖర్, సుమాకు ఓ విషయం తెలిసింది. వరదలు, భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారికి ప్రభుత్వం రూ. 5 లక్షలు పరిహారం ఇస్తోందని తెలుసుకున్నారు. అంతే మా కుమారుడు మట్టి దిబ్బల కిందపడి మరణించాడని బోరున విలపించడం మొదలు పెట్టారు.
విషయం తెలుసుకున్న అధికారులు ఎక్కడ మీ కుమారుడు మరణించాడు చూపించాలని సోమశేఖర్, సుమాకు చెప్పారు. సోమశేఖర్, సుమా చూపించిన ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్యూ సిబ్బంది గాలించారు.
నాలుగు రోజులు అయినా బాలుడి మృతదేహం చిక్కకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. సోమశేఖర్, సుమా కుమారుడు మరణించాడని బాధలో పొంతనలేని సమాచారం ఇస్తున్నారని మరో రోజు బాలుడి మృతదేహం కోసం గాలించినా ఫలితం లేదు.
అసలు సోమశేఖర్, సుమా ఎవరు అని మడికేరి గ్రామీణ పోలీసులు ఆరా తీశారు. సోమశేఖర్, సుమా వారి కుటుంబ సభ్యులను వదిలి పెట్టి రెండో పెళ్లి చేసుకుని వచ్చారని పోలీసులు గుర్తించారు. సుమా కుమారుడు ఆమె పుట్టింటిలో ఉన్నాడని తెలుసుకున్నారు. పరిహారం కోసం తప్పుదోవ పట్టించారని తెలుసుకున్న మడికేరి గ్రామీణ పోలీసులు సోమశేఖర్, సుమాల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.