ఆసక్తికరం: మమతను ఢీకొట్టేందుకు సీపీఎం-బీజేపీ పొత్తు! ఏచూరీ ఏం చెప్పారంటే?
కోల్కతా: రాజకీయాల్లో ఏ పార్టీతో ఏ పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకుంటుందో, ఎప్పుడు విడిపోతుందో చెప్పలేం. కానీ కాంగ్రెస్ -బీజేపీ, బీజేపీ - తెలుగుదేశం, బీజేపీ - లెఫ్ట్ పార్టీలు.. ఇలా కొన్ని పార్టీల పొత్తులను దాదాపు ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా బీజేపీ - సీపీఎం పొత్తులు ఎక్కడా కనిపించవు! అలాంటిది ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలుస్తున్నాయట.
చదవండి: మోడీ-షాల ఆందోళన: రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ కౌంటర్, లీగల్ నోటీసులపై ప్రధాని స్పందన!
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, సీపీఎం పొత్తు పెట్టుకుంటున్నాయట. ఈ వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరి కొట్టి పారేశారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా స్థానికంగా పొత్తు పెట్టుకున్నారని తెలుస్తోంది.
చదవండి: కర్నాటక ప్రచారంలో టంగ్ స్లిప్: నరేంద్ర మోడీకి సిద్ధరామయ్య ప్రశంసలు
మమతను ఓడించేందుకు సీపీఎం, బీజేపీ పొత్తు
మమత నేతృత్వంలోని టీఎంసీని ఓడించేందుకు నదియా జిల్లాలో బీజేపీ, సీపీఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇది సాధారణంగా సీట్ల సర్దుబాటులో భాగంగా జరిగిందని జిల్లా స్థాయి సీపీఎం నాయకులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. టీఎంసీకి వ్యతిరేకంగా చాలా గ్రామాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీతో కలిసి సీట్ల సర్దుబాటు చేసినట్లు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో పొత్తు!
నదియా జిల్లాలోని కరీంపూర్-రానాఘాట్ ప్రాంతంలో ఏప్రిల్ చివరి వారంలో ఇరు పార్టీల నేతలు కలిసి తృణమూల్కు వ్యతిరేక ర్యాలీ చేపట్టారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా టీఎంసీ హింసపై నిరసన వ్యక్తం చేశారు. ఇరుపార్టీల నేతలు తమ పార్టీల జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. గ్రామ స్థాయిలో సీట్ల సర్దుబాటు కోసమే తాము కలిశామని, గ్రామాల్లో ఓట్ల విభజన జరగకుండా గట్టి పోటీ ఇవ్వాలనే ఇలా చేశామని, తమ పార్టీ సిద్ధాంతాలకు దీనికి సంబంధం లేదని సీపీఎం నదియా జిల్లా నేత అన్నారు.
మా ర్యాలీలో సీపీఎం పాల్గొన్నది
నదియాలో తాము టీఎంసీకి వ్యతిరేకంగా పని చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు చెప్పారు. టీఎంసీకి వ్యతిరేకంగా తాము ర్యాలీకి పిలుపునిచ్చామని, సీపీఎం కూడా తమతో కలిసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడి పరిస్థితులు విపక్షాలను ఏకం చేశాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
వేర్వేరు సిద్ధాంతాలు
సాధారణంగా బీజేపీ, సీపీఎం పార్టీల సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. ఇరు పార్టీలు ఎక్కడా కలవవు. బీజేపీది వేర్పాటువాదమని సీపీఎం విమర్శలు గుప్పిస్తే, కాలం చెల్లిన వాటితో సీపీఎం ముందుకు సాగుతుందని, దేశభక్తులను కాకుండా విదేశీ భక్తులను కొలుస్తుంటారని బీజేపీ.. సీపీఎంపై నిత్యం విమర్శలు గుప్పిస్తుంటుంది. ఇలాంటి ఈ రెండు పార్టీలు కలవడం ఆశ్చర్యకరమే.
అసత్య ప్రచారమని సీతారాం ఏచూరీ
ఇదిలా ఉండగా, నదియాలో బీజేపీకి, తమకు మధ్య ఎలాంటి పొత్తు లేదని సీతారాం ఏచూరీ వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి అసత్య ప్రచారాన్ని చేసిందన్నారు. వామపక్షాలపై హింసాకాండను దృష్టి మళ్లించేందుకు ఇలా చేశారన్నారు. బీజేపీ, టీఎంసీలతో తమకు ఎలాంటి పొత్తు ఉండదని, రెండు పార్టీలకు తాము వ్యతిరేకమన్నారు.